ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ

ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ

ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీని బిజెపి ప్రకటించింది.  మంగళవారం భువనేశ్వర్‌లో ఒడిసా బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, భూపేంద్ర యాదవ్‌ పరిశీలకులుగా హాజరయ్యారు. అనంతరం మాఝీని శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాజ్‌నాథ్‌ ప్రకటించారు.

కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రవతి పరీదా ఉపముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపారు.  రాష్ట్రంలో బిజెపి సీనియర్‌ నేతల్లో ఒకరైన మాఝీ ఇప్పటివరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో చీఫ్ విప్గా పనిచేశారు. ఈ సారి ఎన్నికల్లో కియోంజర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేడీ అభ్యర్థి మీనా మాఝీపై 11,577 ఓట్ల తేడాతో గెలిచారు.

మోహన్‌ చరణ్‌ 1997-2000 మధ్యన ఆదివాసీ ప్రాంతం రాయికల సర్పంచ్‌గా పనిచేశారు. ఈయన తండ్రి వాచ్‌మన్‌. కాగా, 2000 సంవత్సరంలో మాఝీ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2019లోనూ నెగ్గారు. ప్రజా సంబంధాలు, సంస్థాగతంగా బీజేపీ బలోపేతానికి కృషి చేశారు.

మరోవైపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం బుధవారం సాయంత్రం 5గంటలకు జనతా మైదానంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఆయనతోపాటు మరి కొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. 

పూరి జగన్నాధుడికి, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు ఆహ్వాన లేఖలు అందజేసినట్లు బీజేపీ తెలిపింది. ఈ వేడుకకు సుమారు లక్ష మంది పాల్గొంటారన్న అంచనా వేస్తున్నారు.

ఒడిశా శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించింది. రెండున్నర దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని పాలించిన బిజూ జనతాదళ్‌ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 చోట్ల గెలిచింది. బిజు జనతా దళ్‌ 51, కాంగ్రెస్‌ 14, ఇతరులు 4 చోట్ల గెలుపొందారు. 

ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును చెప్పకుండానే ఎన్నికల్లో ముమ్మర ప్రచారం చేసిన బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను కైవసం చేసుకుంది. లోక్‌సభ స్థానాల్లో కూడా బీజేపీ అదరగొట్టింది. మొత్తం 21 లోక్‌సభ స్థానాలకుగాను 20చోట్ల కమలం పార్టీ విజయం సాధించగా కాంగ్రెస్‌ ఓ స్థానంలో గెలుపొందింది. బిజూ జనతాదళ్‌ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది.

2000, 2004లలో బీజేడీతో కలిసి సంకీర్ణ సర్కార్‌లో బీజేపీ భాగస్వామిగా ఉంది. అయితే ఒడిషాలో తొలిసారిగా బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.