నేడే మోదీ ప్రమాణం.. కొలువుదీరనున్న ఎన్డీయే సర్కార్‌

నేడే మోదీ ప్రమాణం.. కొలువుదీరనున్న ఎన్డీయే సర్కార్‌
ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. 8 వేల మంది అతిథులు మోదీ ప్రమాణాన్ని తిలకించనున్నారు.
 
 బంగ్లాదేశ్‌, శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌, మారిషన్‌, సెషెల్స్‌తో పాటు మాల్దీవ్స్‌ దేశాధినేతలు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. మోదీ క్యాబినెట్‌లో 27-30 మంది ఉండే అవకాశం ఉంది.  రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు. తద్వారా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డు సమం చేయనున్నారు.

మరోవైపు మోదీ 3.0 కేబినెట్​పై ఆసక్తి నెలకొంది. ఎన్​డీఏ కూటమిలోని మిత్రపక్షాలకు 5 నుంచి 8 కేబినెట్‌ బెర్త్‌లు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కీలకమైన హోంశాఖ, ఆర్థిక శాఖ, రక్షణశాఖ, విదేశాంగ శాఖతో పాటు విద్య, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు తమ వద్దనే ఉండనున్నట్లు బీజేపీ సంకేతాలు ఇచ్చింది. అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ మరోసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం ఖాయంగా తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్‌, బసవరాజ్‌ బొమ్మై, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, సర్బానంద సోనోవాల్‌ మంత్రిపదవులు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, జేడీయూ నుంచి లలన్‌ సింగ్‌ లేదా సంజయ్‌ ఝా, రామ్‌నాథ్‌ ఠాకూర్‌, లోక్‌జనశక్తి రాం విలాస్‌ పాసవాన్‌ పార్టీకి చెందిన చిరాగ్‌ పాసవాన్‌ మంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. 

మంత్రివర్గ కూర్పుపై ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా చర్చలు జరుపుతున్నారు. ప్రతి నలుగురైదురుగు ఎంపీలకు ఒక మంత్రి పదవి చొప్పున కేటాయిస్తామని, ఇద్దరు ఎంపీలు ఉన్న పార్టీకి సహాయ మంత్రి పదవి ఇస్తామని బీజేపీ ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం.

ఇక మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ్‌సింఘే, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌, భూటాన్‌ ప్రధాని తోబ్గే తదితర విదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ దిల్లీ చేరుకున్నారు.

మరోవైపు ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. స్థానిక పోలీసులతోపాటు కీలక ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలు, ఎన్‌ఎస్‌జీ కమాండోలు, డ్రోన్లు, స్నైపర్లను మోహరించారు. దిల్లీని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్​ లోపల, బయట మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు.