నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడం వెనుక కుట్ర!

నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడం వెనుక కుట్ర!
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంపై ఓ ప్రత్యేక కమిటీతో దర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణత వెనుక కుట్ర జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 
 
నవీన్ పట్నాయక్ సన్నిహితుడు, తమిళనాడుకు చెందిన వీకే పాండియన్ను పరోక్షంగా ఉద్దేశిస్తూ, రాష్ట్రానికి ఒడిశా ముఖ్యమంత్రే కావాలని ప్రజలు అనుకుంటున్నారని, అందుకే 25 ఏళ్ల బీజేడీ పాలనను అంతం చేయాలని నిర్ణయించుకున్నారని మోదీ తెలిపారు. ఒడిశాలోని మయూర్భంజ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ, 10 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 11స్థానం నుంచి 5స్థానానికి వెళ్లిందని గుర్తు చేశారు.
 
“ప్రస్తుతం నవీన్ బాబు సన్నిహితులు అందరూ ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. గతేడాది కాలంలో ఆయన ఆరోగ్యం ఎంతలా క్షీణించిందో చూసి బాధపడుతున్నారు. ఆయనకు సన్నిహితంగా ఉండేవారు ఎవరైనా నన్ను కలిస్తే తప్పకుండా నవీన్ ఆరోగ్యం గురించి మాట్లాడుతారు. ఆయన తన పనులను తాను చేసుకోలేకపోతున్నారని చెప్పారు” అని ప్రధాని వెల్లడించారు. 
 
“ఆయన ఆరోగ్య క్షీణత వెనుక కుట్ర జరిగి ఉండొచ్చని ఆయన సన్నిహితులు నా దగ్గర వాపోయారు. నవీన్ పట్నాయక్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వెనుక ఏదైనా కుట్ర జరిగిందా? ఆయన ఆరోగ్యం క్షీణించడానికి కారణమైన వారే ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? ప్రస్తుతం జరుగుతున్న ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే, దీనిపై ఓ ప్రత్యేక కమిటీని నియమించి దర్యాప్తు చేస్తాం” అని మోదీ స్పష్టం చేశారు.

ఒడిశా సిఎం చేతి కదలికలను కూడా పాండియన్ నియంత్రిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించిన మరునాడు పట్నాయక్ ఆరోగ్య స్థితిపై ప్రధాని ఆ వ్యాఖ్య చేశారు. ఒక సమావేశంలో ఉపన్యాసం ఇస్తుండగా పట్నాయక్ చేయి వణుకుతుండగా దానిని ఒక బల్లపై పాండియన్ ఉంచడాన్ని చూపుతున్న ఒక వీడియోను హిమంత శర్మ ’ఎక్స్’ పోస్ట్‌లో పంచుకుంటూ, ‘ఇది చాలా బాధపెట్టే వీడియో. నవీన్ బాబు చేతి కదలికలను సైతం వికె పాండియన్ నియంత్రిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

ఓబీసీ హక్కులను ముస్లింలకు

బంగాల్‌లోని టీఎంసీ ప్రభుత్వం నకిలీ కుల ధ్రువీకరణపత్రాల ద్వారా అసలైన ఓబీసీ హక్కులను ముస్లింలకు కట్టబెడుతోందని ప్రధాన మంత్రిమోదీ ఆరోపించారు. వాటిని కలకత్తా హైకోర్టు రద్దు చేసినా, టీఎంసీ ఆ తీర్పును అంగీకరించటం లేదని దుయ్యబట్టారు. 

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా బంగాల్‌లోని కక్‌ద్వీప్‌ బహిరంగసభలో పాల్గొన్న ప్రధాని మోదీ, ఓ వర్గాన్ని బుజ్జగించేందుకు టీఎంసీ ప్రభుత్వం బహిరంగంగానే రాజ్యాంగంపై దాడి చేస్తోందని ధ్వజమెత్తారు. అంతేకాకుండా నకిలీ కులధ్రువపత్రాల విషయంలో టీఎంసీ ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

“బంగాల్‌ యువతకు లభించాల్సిన అవకాశాలను చొరబాటుదారులు లాక్కుంటున్నారు. మీ ఆస్తిపాస్తులను వారు కబ్జా చేస్తున్నారు. బంగాల్‌ సరిహద్దు ప్రాంతాల్లో జనాభా లెక్కలు మారిపోవటంపై దేశమంతా చింతిస్తోంది” అని ప్రధాని తెలిపారు. 

“ప్రతిపక్షాలు సీఏఏను వ్యతిరేకించటం, సీఏఏపై అసత్యాలు చెప్పటం సహా తప్పుడు ప్రచారం ఎందుకు చేశారంటే బంగాల్‌లో చొరబాటుదారులను రక్షించాల్సి ఉంది. హిందూ శరణార్థులు, మథువా శరణార్థులను టీఎంసీ బంగాల్‌లో ఉండనివ్వకూడదని అనుకుంటోంది. కానీ మీరు (హిందూ శరణార్థులు) చింతించవద్దు. జూన్‌ 4వ తేదీ తర్వాత టీఎంసీ నేతల పని అయిపోతుంది.” అని మోదీ భరోసా ఇచ్చారు.