క్యాంపస్‌లో హిజాబ్ ధరించడంపై ఆంక్షల్లేవు

క్యాంపస్‌లో హిజాబ్ ధరించడంపై ఆంక్షల్లేవు
పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై ఎటువంటి ఆంక్షలు లేవని కర్ణాటక ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు తెలిపింది. కేవలం తరగతి గదుల్లో తరగతులు జరిగే సమయంలో మాత్రమే యూనిఫాం పాటించాలని చెప్పింది. 
 
ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లపై ఎనిమిదో రోజు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవడ్గి వాదనలు వినిపించారు.  భారత రాజ్యాంగంలోని అధికరణ 19 ప్రకారం హిజాబ్ ధరించే హక్కు ఉందని, ఈ హక్కుపై అధికరణ 19(2) ప్రకారం ఆంక్షలు విధించవచ్చునని తెలిపారు.
ప్రస్తుత కేసులో విద్యా సంస్థల లోపల సమంజసమైన ఆంక్షలను రూల్ 11 విధిస్తోందని చెప్పారు. ఇది సంస్థాగత క్రమశిక్షణకు లోబడి ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ ఫరూఖీ తీర్పును ప్రస్తావించారు. ఇస్లాం మతాన్ని ఆచరించేందుకు మసీదు ముఖ్యమైనది కాదని, నమాజ్‌ను ఎక్కడైనా చేయవచ్చునని, ఆరుబయట కూడా నమాజ్ చేయవచ్చునని ఈ తీర్పులో చెప్పారని తెలిపారు.
అయితే దీనిని రాజ్యాంగం నిషేధించలేదని పేర్కొన్నారు. మతంలో అంతర్భాగంగా, అనివార్యంగా ఉన్న ఆచారాలను పాటించేందుకు అధికరణలు 25, 26 ప్రకారం రక్షణ లభిస్తుందని ఈ తీర్పు పేర్కొందని తెలిపారు. ఓ ఆచారం మతపరమైనది కావచ్చునని, అయితే అది ఆ మతాన్ని పాటించడంలో అంతర్భాగం లేదా అనివార్యం కాకపోవచ్చునని చెప్పినట్లు తెలిపారు.
 ఈ కేసులో సంక్లిష్టతను వివరిస్తూ, ఒకవేళ హిజాబ్‌కు మతపరమైన అనుమతిని ఇస్తే, వెనువెంటనే ఆ మతాన్ని ఆచరించే మహిళలు హిజాబ్ ధరించాలనే నిర్బంధానికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.  నచ్చినదానిని ధరించడానికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. మానవ గౌరవ, మర్యాదలలో స్వేచ్ఛ ఇమిడియుంటుందని, ధరించడానికి, మానేయడానికి అవకాశం ఉంటుందని వివరించారు.
నిర్బంధం విధించాలని పిటిషనర్ కోరుతున్నారని, ఇది రాజ్యాంగ విలువలకు విరుద్ధమని చెప్పారు. దీనిని తప్పనిసరి చేయకూడదని స్పష్టం చేశారు. సంబంధిత మహిళల ఇష్టానికి వదిలిపెట్టాలని సూచించారు.  మతం ఆధారంగా ఎటువంటి వివక్ష ఉండకూడదని, ప్రైవేటు అన్ఎయిడెడ్ మైనారిటీ సంస్థల విషయానికొస్తే చెబుతూ వాటిలో యూనిఫాం కోడ్ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని తెలిపారు. నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఆయా సంస్థలకే వదిలిపెడుతోందని చెప్పారు.