ర‌ష్యాపై వేయి డ్రోన్ల‌తో విరుచుకుప‌డ్డ ఉక్రెయ‌న్.. ఇద్ద‌రు మృతి

ర‌ష్యాపై వేయి డ్రోన్ల‌తో విరుచుకుప‌డ్డ ఉక్రెయ‌న్.. ఇద్ద‌రు మృతి
ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం భీక‌రంగా కొన‌సాగుతోంది. తాజాగా ర‌ష్యాపై ఉక్రెయిన్ భీక‌ర దాడుల‌కు పాల్ప‌డింది. రష్యా రాజ‌ధాని మాస్కోతోపాటు ఇర‌త ప్రాంతాల‌పై ఏకంగా 1,000కి పైగా డ్రోన్ల‌తో విరుచుకుప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మ‌ర‌ణించ‌గా, 20 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు. ర‌ష్యాలో ప్ర‌స్తుతం పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఆదివారం తుదిద‌శ పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇలాంటి త‌రుణంలో ఉక్రెయిన్ దాడి చేయడం కీల‌కంగా మారింది. 
 
శ‌నివారం రాత్రి నుంచి ఉద‌యం వ‌ర‌కు ఉక్రెయిన్ దాడుల‌కు పాల్ప‌డింది. ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఉక్రెయిన్ చేసిన అతిపెద్ద దాడి ఇదే అని విశ్లేష‌కుల అంచ‌నా. ఈ దాడిపై మాస్కో మేయ‌ర్ సెర్గీ సొబ్యానిన్ మాట్లాడుతూ ర‌ష్యా రాజ‌ధానిపై జ‌రిగిన అతిపెద్ద దాడిగా ఆయ‌న అభివ‌ర్ణించారు. మాస్కోలోని ఆయిల్ రిఫైన‌రీతోపాటు, ప్ర‌జ‌ల నివాసాల‌పై కూడా దాడి జ‌రిగింద‌ని ఆయ‌న తెలిపారు. 
 
ఈ దాడిలో ఇద్ద‌రు మ‌ర‌ణించారు. మ‌రో 20 మంది గాయ‌ప‌డ్డారు. మృతుల్లో 74 ఏళ్ల ఒక వృద్ధుడు, 44 ఏళ్ల మ‌హిళ ఉన్నారు. ఈ దాడిపై ర‌ష్యా ర‌క్ష‌ణ శాఖ కూడా స్పందిస్తూ ఉక్రెయిన్ ప్ర‌యోగించిన 1,100 డ్రోన్‌ల‌ను తాము కూల్చివేశామ‌ని తెలిపింది. ర‌ష్యాలోని క్రిమియాతోపాటు న‌ల్ల స‌ముద్రంపై కూడా దాడి జరిగింద‌ని తెలిపింది. మాస్కోపై ప్ర‌యోగించిన 450 డ్రోన్ల‌ను తాము నిర్వీర్యం చేశామ‌ని ర‌ష్యా ప్ర‌క‌టించింది.  
 
ఆపరేషన్ కొనసాగుతూ ఉండడంతో, దాడుల వల్ల జరిగిన నష్టం తీవ్రతను రష్యా అధికారులు ఇంకా నివేదిస్తూనే ఉన్నారు. రష్యా తన పార్లమెంటరీ ఎన్నికల మూడవ, చివరి రోజును పూర్తి చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ఎన్నికను రష్యా మొట్టమొదటి యుద్ధకాల పార్లమెంటరీ ఎన్నికగా అభివర్ణించారు. ఈ ఓటింగ్‌లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విధానాలకు వ్యతిరేకత దాదాపుగా లేకుండా పోయింది. ఇది క్రెమ్లిన్ ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని భావిస్తున్నారు. 
 
యుద్ధం ప్రారంభమైన తర్వాత మాస్కో స్వాధీనం చేసుకున్న, కానీ పూర్తి నియంత్రణలో లేని నాలుగు ఉక్రేనియన్ ప్రాంతాలలో కూడా రష్యా ఓటింగ్ నిర్వహించింది. 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న నల్ల సముద్ర ద్వీపకల్పమైన క్రిమియాలో కూడా ఓటింగ్ జరిగింది. ఆక్రమిత భూభాగాల్లో జరిగిన ఎన్నికలను కీవ్ చట్టవిరుద్ధమని ఖండించింది.  రష్యా ఎన్నికలకు అంతరాయం కలిగించే ప్రయత్నమే ఈ డ్రోన్ దాడి అని సోబియానిన్ ఆరోపించారు. “ఈ విషయంలో శత్రువు విఫలమయ్యాడు,” అని మాస్కో మేయర్ పేర్కొన్నారు. అయితే, ఈ దాడిపై ఉక్రెయిన్ ఇప్ప‌టిదాకా అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు.