ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ హవా, 3 స్థానాలు కైవసం

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ హవా, 3 స్థానాలు కైవసం
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ( ఏబీవీపీ) కీలకమైన నాలుగు స్థానాల్లో మూడింటిని గెలుచుకుంది. ఆ సంస్థ అభ్యర్థులు అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను దక్కించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యుఐ) మాజీ సభ్యుడు అయిన దీపాంశు షోకీన్ ఉపాధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. 
 
అధ్యక్ష పదవికి జరిగిన పోటీలో,  ఏబీవీపీకి చెందిన యశ్ దాబాస్ 24,576 ఓట్లతో ముందంజలో నిలవగా,  ఎన్‌ఎస్‌యుఐకి చెందిన విజయ్ శంకర్ మీనా 22,523 ఓట్లు సాధించారు. కార్యదర్శి పదవికి  ఏబీవీపీకి చెందిన రియా ఛావడి 21,650 ఓట్లతో విజయం సాధించగా,  ఎన్‌ఎస్‌యుఐకి చెందిన నమ్రత చౌదరి 14,869 ఓట్లు పొందారు. సంయుక్త కార్యదర్శి పదవికి  ఏబీవీపీకి చెందిన లక్ష్య 16,615 ఓట్లతో గెలుపొందారు. ఆ తర్వాతి స్థానాల్లో సమాజ్‌వాదీ ఛాత్ర సభ (ఎస్ సి ఎస్) అభ్యర్థి విశేష్ యాదవ్ (15,778 ఓట్లు),  ఎన్‌ఎస్‌యుఐ అభ్యర్థి గోపాల్ (15,206 ఓట్లు) నిలిచారు. 
 
షోకీన్ 30,615 ఓట్లతో ఉపాధ్యక్ష పదవిని గెలుచుకున్నారు.  ఏబీవీపీకి చెందిన ఇషు మౌర్య 16,910 ఓట్లు సాధించగా,  ఎన్‌ఎస్‌యుఐకి చెందిన వీర్ 4,313 ఓట్లు పొందారు. మొత్తం 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాలను ప్రకటించారు. ఫలితాల ప్రకటనకు ముందు, హైకోర్టు ఆదేశాల మేరకు విజేతలు, వారి మద్దతుదారులు క్యాంపస్ లోపల లేదా బయట విజయ ర్యాలీలు నిర్వహించవద్దని అధికారులు సూచించారు. 
 
11వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి, అధ్యక్ష పదవి కోసం  ఎన్‌ఎస్‌యుఐ ఏబీవీపీ  మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎన్‌ఎస్‌యుఐ  అభ్యర్థి మీనా (13,271 ఓట్లు) 338 ఓట్ల ఆధిక్యంతో,  ఏబీవీపీ  అభ్యర్థి దాబాస్ (12,933 ఓట్లు) కంటే ముందున్నారు. అదే సమయంలో, ఉపాధ్యక్ష పదవికి షోకీన్ బలమైన ఆధిక్యాన్ని (17,283 ఓట్లు) సాధించారు. 
 
పేపర్ లీక్‌ల ఆరోపణలపై ఇటీవల జరిగిన విద్యార్థి నిరసనల నేపథ్యంలో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ ఎన్నికల్లో 40.46 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఏడాది ప్రచారంలో విద్యార్థుల సంక్షేమం, క్యాంపస్ సౌకర్యాలు, హాస్టల్ వసతి, భద్రత వంటి ప్రధాన సమస్యలు లేవనెత్తారు. ఈ నెల ప్రారంభంలో సత్య నికేతన్ పీజీ భవనం కూలి ఏడుగురు మరణించిన ఘటన తర్వాత వీటికి మరింత ప్రాధాన్యత చేకూరింది. 
 
ఈ ఎన్నికల కోసం సుమారు 1,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లను  వినియోగించగా, వాటిలో 960 ఈవీఎంలను పోలింగ్ రోజున ఉపయోగించారు. పోలింగ్ అనంతరం, పోలీసులు ఈవీఎంలను మల్టీపర్పస్ హాల్‌కు తరలించారు. అక్కడ వాటిని తెరిచి లెక్కించారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, వ్యూహాత్మక ప్రదేశాలలో పోలీసు సిబ్బంది, పారామిలిటరీ బలగాలను మోహరించారు.  అదే సమయంలో, క్యాంపస్‌ల అంతటా పాదరక్షక బృందాలు, మోటార్ సైకిల్ బృందాలు, పీసీఆర్ వ్యాన్‌లు అందుబాటులో ఉన్నాయి.
విశ్వవిద్యాలయం జారీ చేసిన సలహా మేరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఫలితాల ప్రకటన వెలువడే వరకు శనివారం కూడా అమలులో ఉంటాయి. గత ఏడాది జరిగిన  ఎన్నికలలో, బీజేపీ ఏబీవీపీ మూడు స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్‌కు చెందిన ఎన్‌ఎస్‌యుఐ ఒక స్థానాన్ని గెలుచుకుంది.ఏబీవీపీకి చెందిన ఆర్యన్ మాన్ అధ్యక్షుడిగా, దీపికా ఝా సంయుక్త కార్యదర్శిగా, కునాల్ చౌదరి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవిని మాత్రంఎన్‌ఎస్‌యుఐదక్కించుకుంది.