టీ20 ఆసియాక్‌పలో 7 వికెట్లతో పాకిస్థాన్‌ను చిత్తుచేసిన భారత్

టీ20 ఆసియాక్‌పలో 7 వికెట్లతో పాకిస్థాన్‌ను చిత్తుచేసిన భారత్
మహిళల టీ20 ఆసియాక్‌పలో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. శనివారం జరిగిన తమ గ్రూప్‌-ఎ ఆఖరి పోరులో హర్మన్‌ప్రీత్‌ సేన 7 వికెట్లతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. మహిళల టి-20 ఆసియా కప్‌లో ఖతర్నాక్‌ బౌలింగ్‌తో చిరకాల ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ హ్యాట్రిక్‌ విజయం అందుకొని సెమి ఫైనల్ కు చేరుకుంది. మన స్పిన్నర్లు శ్రీచరణి (4-0-7-3) ప్రేమా రావత్‌ (4-0-9-3) సుడులు తిరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్ల పనిబట్టారు.
భారత స్పిన్‌ జోడీ ధాటికి కేవలం 55 పరుగులకే కుప్పకూలిన పాక్‌ తమ టీ20 చరిత్రలోనే అత్యల్ప స్కోరును నమోదు చేసి చెత్త రికార్డును మూటగట్టుకుంది. దాయాది పోరులో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భార‌త జ‌ట్టు అదరగొట్టింది. తొలుత బౌలర్ల విజృంభణతో పాకిస్థాన్‌ను కేవలం 55 పరుగులకే కట్టడి చేసిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన అనంతరం 8.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరోసారి భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో ఏకపక్ష ఆధిపత్యం కనిపించింది.
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలో మునీబా అలీ, షవాల్‌ జుల్ఫికర్‌ మంచి ఆరంభం అందించారు. తొలి నాలుగు ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 23 పరుగులు చేశారు. అయితే షఫాలీ వర్మ బౌలింగ్‌కు రావడంతో పాక్‌ పతనం మొదలైంది. ఐదో ఓవర్‌లో మునీబా అలీని బౌల్డ్‌ చేసిన షఫాలీ భారత్‌కు తొలి బ్రేక్‌ ఇచ్చింది. ఆ తర్వాత శ్రీ చరణి వరుస దెబ్బలు కొట్టడంతో పాక్‌ పవర్‌ప్లే ముగిసేసరికి 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
అక్కడి నుంచి పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ పూర్తిగా కుప్పకూలింది.  చరణి మరో వికెట్‌ తీయగా, ప్రీమా రౌత్‌ తన స్పిన్‌తో పాక్‌ బ్యాటర్లను ఇబ్బంది పెట్టింది. దీప్తి శర్మ కూడా కీలక వికెట్లు పడగొట్టింది. తొమ్మిది ఓవర్లు పూర్తయ్యేసరికి పాకిస్థాన్‌ 35 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. పరుగులు రాబట్టడంలో విఫలమైన పాక్‌ బ్యాటర్లు చెత్త షాట్లతో వరుసగా పెవిలియన్‌ చేరారు.

మరోవైపు భారత ఫీల్డర్లు కూడా చురుగ్గా వ్యవహరించారు. ఈమాన్‌ ఫాతిమా రనౌట్‌ కావడంతో పాక్‌ కష్టాలు మరింత పెరిగాయి. ప్రీమా రౌత్‌ ఉమ్మె హానీ, నష్రా సాంధూలను ఔట్‌ చేసి మూడు వికెట్ల ఘనత సాధించింది. చివర్లో టుబా హసన్‌ను దీప్తి శర్మ స్టంపౌట్‌ చేయడంతో 18.1 ఓవర్లలో పాకిస్థాన్‌ 55 పరుగులకు ఆలౌటైంది. భారత్‌ బౌలర్లలో శ్రీ చరణి 3/7, ప్రీమా రౌత్‌ 3/9, దీప్తి శర్మ 2/5తో అదరగొట్టారు.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు కూడా ఆరంభంలో స్వల్ప ఎదురుదెబ్బ తగిలింది. ఫాతిమా సనా మూడు వికెట్లు తీసి మ్యాచ్‌లో ఉత్కంఠ రేపేందుకు ప్రయత్నించింది. అయితే లక్ష్యం చాలా చిన్నది కావడంతో భారత జట్టు పెద్దగా ఇబ్బంది పడలేదు. కేవలం 8.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 68 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించడం భారత ఆధిపత్యానికి అద్దం పట్టింది.

ఈసారి పోరు పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఆరంభం నుంచి చివరి వరకు భారత మహిళల జట్టుదే ఆధిపత్యం. పాకిస్థాన్‌కు ఏ దశలోనూ కోలుకునే అవకాశం ఇవ్వకుండా టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టీ20ల్లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో భారత్‌ 15 విజయాలతో స్పష్టమైన పైచేయి సాధించగా, పాకిస్థాన్‌ ఖాతాలో కేవలం 3 విజయాలే ఉన్నాయి. తాజా మ్యాచ్‌లోనూ భారత్‌ అదే ఆధిపత్యాన్ని కొనసాగించి పాక్‌కు మరోసారి షాకిచ్చింది. ప్రస్తుతం ఈ పోటీలో భారత్, శ్రీలంక మాత్రమే ఓటమి ఎరుగని జట్లుగా ఉన్నాయి.

సంక్షిప్త స్కోర్లు

పాకిస్థాన్‌: 18.1 ఓవర్లలో 55 ఆలౌట్‌ (షవాల్‌ జుల్ఫికర్‌ 14, మునీబా అలీ 13; శ్రీచరణి 3/7, ప్రేమా రావత్‌ 3/9, దీప్తి శర్మ 2/5).

భారత్‌: 8.4 ఓవర్లలో 57/3 (హర్మన్‌ప్రీత్‌ 18 నాటౌట్‌, షఫాలీ 12, దీప్తి 12 నాటౌట్‌; ఫాతిమా 3/17).