నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతిలపై శ్రీనగర్ లో బిజెపి ఆందోళన 

నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతిలపై శ్రీనగర్ లో బిజెపి ఆందోళన 
నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి ఆరోపణలకు నిరసనగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం లాల్ చౌక్‌లోని ఘంటా ఘర్ వద్ద ఆందోళన చేపట్టారు. “నిరుద్యోగం, అవినీతి, పంచాయతీ ఎన్నికల సమస్యలపై బీజేపీ నిరసన తెలుపుతోంది. మేము లాల్ చౌక్‌లోని ఘంటా ఘర్ నుంచి ప్రారంభించి, సచివాలయాన్ని ముట్టడించడానికి వెళ్తాము” అని బీజేపీ నాయకుడు అల్తాఫ్ ఠాకూర్ పేర్కొన్నారు. 
 
శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లోని ఘంటా ఘర్ నుంచి సివిల్ సెక్రటేరియట్ వరకు భారీ భద్రతను మోహరించారు. ఇటీవలి విద్యుత్ ఛార్జీల పెంపుపై బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగా, ఆ నిర్ణయం తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నామని ఒమర్ అబ్దుల్లా వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా, జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, పార్లమెంటులో, సుప్రీంకోర్టులో కేంద్రం చేసిన హామీలకు జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఈరోజు గిందున్ పార్క్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించింది. 
 
మంగళవారం, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు సునీల్ కుమార్ శర్మ, ఏకకాలంలో నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చినందుకు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి), ఒమర్ అబ్దుల్లాలపై విమర్శలు గుప్పించారు. శర్మ మాట్లాడుతూ, “జమ్మూ కాశ్మీర్ సామాన్య ప్రజల సమస్యలను లేవనెత్తడానికి బిజెపి నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయాన్ని నెల రోజుల క్రితమే ప్రకటించింది. ఈ నిరసన  ప్రధాన లక్ష్యం యువతకు ఉద్యోగాలు కల్పించడం” అని తెలిపారు. 
 
అయితే, “నేషనల్ కాన్ఫరెన్స్ కూడా నిరసన ప్రదర్శన చేపట్టాలని ఈ రోజు అకస్మాత్తుగా నిర్ణయించుకుంది. వారి సమయపాలన చూడండి. యువత పట్ల వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో చూడండి. వారు 25,000 ఉద్యోగాలను కాంట్రాక్టర్లకు అమ్ముకున్నారు” అంటూ ధ్వజమెత్తారు. 
 
 “మొత్తం మీద, బిజెపి కార్యాలయాలను ముట్టడిస్తామన్న నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటన, రేపటి నిరసనలో బిజెపి ఏ యువత సమస్యలనైతే హైలైట్ చేస్తుందో, అవే యువతను మరోసారి అపహాస్యం చేయడమే. ఈ పార్టీకి యువత పట్ల చిత్తశుద్ధి ఉందని నేను అనుకోవడం లేదు; ఈ చర్య కేవలం వారి గత తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం మాత్రమే,” అని ఆయన పేర్కొన్నారు.

 ఇదే సమయంలో, నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్న ర్యాలీ నేపథ్యంలో శ్రీనగర్‌లోని బీజేపీ కార్యాలయం చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చినప్పటి నుండి, ఆ పార్టీ పలు నిరసనలు చేపట్టి, రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వస్తోంది.