బిజెపి అధ్యక్షునితో రష్యా రాయబారి భేటీ

బిజెపి అధ్యక్షునితో రష్యా రాయబారి భేటీ
భారతదేశంలో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్, మంగళవారం న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో  భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశంపై చర్చించారు.
 
 “ఈ భేటీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న, కాలపరీక్షకు నిలిచిన భారత్-రష్యా సంబంధాలపై దృష్టి సారించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య ఉన్న బలమైన వ్యక్తిగత అవగాహన, విశ్వాసాన్ని శ్రీ నబిన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు” అని  బీజేపీ విదేశీ వ్యవహారాల శాఖ ఇన్‌చార్జి విజయ్ చౌతైవాలే
తెలిపారు.  వారి మధ్య జరిగే ఉన్నత స్థాయి సమావేశాలు ద్వైపాక్షిక సంబంధాలకు నిరంతర ఊపునిచ్చాయని ఆయన పేర్కొన్నారు.
భారతదేశంతో రాయబారి అలిపోవ్‌కు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని, ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషిని కూడా నబిన్ అభినందించారని చెప్పారు.  ఈ సందర్భంగా, భారత్-రష్యా సంబంధాలు మరింత బలపడటం పట్ల నబిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలో జరగనున్న బ్రిక్స్ సదస్సుతో సహా, మరిన్ని ఉన్నత స్థాయి చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
“భారత్-రష్యా సంబంధాలకు ప్రజల మధ్య సంబంధాలు ఒక శాశ్వతమైన స్తంభం వంటివని ఇరుపక్షాలు నొక్కిచెప్పాయి. రష్యాలో నైపుణ్యం కలిగిన భారతీయ నిపుణులు అందించగల సేవలందిస్తున్న అవకాశాలు పెరుగుతున్నాయని రాయబారి అలీపోవ్ ప్రముఖంగా పేర్కొన్నారు,” అని బిజెపి ప్రకటనలో తెలిపారు.
 
నబిన్, బీజేపీ సంస్థాగత ప్రస్థానం, క్షేత్రస్థాయి నిర్మాణం, పనితీరుపై కూడా ఒక అవలోకనాన్ని పంచుకున్నారు. పార్టీకి ఉన్న విస్తృతమైన సభ్యులు, కార్యకర్తల నెట్‌వర్క్, దాని మోర్చాలు, విభాగాలు, ఇటీవల ఏర్పాటు చేసిన జాతీయ బృందం, ఎన్నికల తర్వాత కూడా నిరంతర సంస్థాగత భాగస్వామ్యంపై బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యత గురించి ఆయన మాట్లాడారు. 
 
“అస్సాం, పశ్చిమ బెంగాల్‌లలో పార్టీ ఇటీవల సాధించిన ఎన్నికల విజయాలకు నబిన్‌కు, బీజేపీకి అలీపోవ్ అభినందనలు తెలిపారు. బీజేపీ సంస్థాగత బలాన్ని, క్షేత్రస్థాయిలో దానికున్న బలమైన ఉనికిని ఆయన ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ప్రజలతో ప్రత్యక్షంగా, నిరంతరం సంబంధాలు కొనసాగించడానికి ప్రధానమంత్రి మోదీ చేపట్టిన ‘మన్ కీ బాత్’ ఒక విశిష్టమైన కార్యక్రమమని కూడా ఆయన కొనియాడారు,” అని ఆ ప్రకటన పేర్కొంది.
 
“2027లో భారత్-రష్యా దౌత్య సంబంధాలకు 80 ఏళ్లు పూర్తికానున్న సందర్భాన్ని ఇరుపక్షాలు ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నాయి. ఈ సందర్భం, ముఖ్యంగా బలమైన సాంస్కృతిక, విద్యా, ప్రజల మధ్య సంబంధాల ద్వారా ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి మరిన్ని అవకాశాలను కల్పిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాయి,” అని ఆ ప్రకటనలో జోడించారు.