పరీక్షా పత్రాల లీకేజీ ఆరోపణలకు వ్యతిరేకంగా ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. నిరసనకారులైన విద్యార్థులకు ఉపశమనం కల్పించేందుకు కోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకున్న అధికారాలను వినియోగించుకుంది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం జారీ చేసిన ఈ ఉత్తర్వు, ఢిల్లీ, అస్సాం, పశ్చిమ బెంగాల్ , బీహార్లలో నిరసనలకు సంబంధించి విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లకు వర్తిస్తుంది.
జూలై 20 నుండి 25 మధ్య ఢిల్లీలోని జంతర్ మంతర్, పరిసర ప్రాంతాల్లో జరిగిన నిరసనల్లో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. కోర్టు వివరాల ప్రకారం, ఈ నిరసనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు మొత్తం 13 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. అయితే, గతంలోనే నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు ఈ ఉపశమనం వర్తించదని కోర్టు స్పష్టం చేసింది.
“గత నేర చరిత్ర కలిగిన 2,873 మందిపై ఢిల్లీ పోలీసులు కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారని మాకు సమాచారం అందింది. వీటిని మినహాయిస్తే, ఇకపై కొత్తగా ఎటువంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయబడవు” అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తెలిపారు. విచారణ సందర్భంగా, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేయాలని సొలిసిటర్ జనరల్ అభ్యర్థించారు.
కోర్టు దృష్టికి రాని ఎఫ్ఐఆర్ కారణంగా, ఈ ఉత్తర్వు పరిధిలోకి వచ్చే విద్యార్థులపై తదుపరి చర్యలు తీసుకోకుండా చూస్తామని ప్రధాన న్యాయమూర్తి సూచించారు. “ఏదైనా రాష్ట్రంలో కోర్టు దృష్టికి రాని ఎఫ్ఐఆర్ ఉంటే, దానిని కొట్టివేయాలనే అభ్యర్థనను ఆయా రాష్ట్రాలు వ్యతిరేకించవు” అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ పేర్కొన్నారు. నీట్ పరీక్షకు సంబంధించి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్న విద్యార్థులకు పరిహారం చెల్లించే అంశాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పరిహారం అంశంపై స్పందిస్తూ, ఈ విషయంపై ఒక విధానాన్ని మూడు నెలల్లోగా రూపొందిస్తామని కోర్టుకు సమాచారం అందిందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
కాగా, సెప్టెంబర్ 5వ తేదీన చేపట్టనున్న నిరసన ప్రదర్శనను రద్దు చేసినట్లు సీజేపీ నేత సౌరవ్ దాస్ సుప్రీంకోర్టుకు చెప్పారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు ఆయన తన ప్రకటనను చదివారు. జూలై నెలలో సీజేపీ నేతలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొనడం వల్ల ఆందోళన విరమిస్తున్నట్లు చెప్పారు. నీట్ యూజీతో పాటు ఇతర పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు సుమారు 36 రోజుల పాటు సీజేపీ కార్యకర్తలు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

More Stories
వారణాసిలో ఉధృతంగా గంగా ..మొత్తం 84 ఘాట్లు మూసివేత
ఢిల్లీలో ప్రతి ముగ్గురు ఓటర్లలో ఒకరి ఓటు తొలగింపు!
`నీట్’ ఆందోళనకారులపై ఎఫ్ఐఆర్లు రద్దు.. `సుప్రీం’కు కేంద్రం వినతి