వారణాసిలో గంగా నది ఉదృతంగా ప్రవహిస్తున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గంగా నదిలో ప్రవాహం గణనీయంగా పెరిగింది. దీంతో కాశీలోని మొత్తం 84 ప్రఖ్యాత స్నాన ఘాట్లను మూసివేశారు. ఆ ఘాట్లన్నీ పూర్తిగా మునిగిపోయాయి. సుమారు 6500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నది నీటిమట్టం సుమారు 69.40 మీటర్ల వద్ద ప్రవహిస్తుండగా, హెచ్చరిక స్థాయి 70.262 మీటర్లుగా, ప్రమాద స్థాయి 71.26 మీటర్లుగా ఉంది.
పెరుగుతున్న నీటిమట్టం కారణంగా ఘాట్ల వెంబడి ఉన్న అనేక ప్రముఖ కట్టడాలు నీట మునిగాయి. నమో ఘాట్లోని ప్రసిద్ధ ‘నమస్తే’ విగ్రహం దాదాపు నీటిలో మునిగిపోయింది. భారీ వర్షాల మధ్య అనేక ఘాట్లు జలవిముక్తమయ్యాయి. నదీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోకి కూడా నీరు ప్రవేశించింది. గంగా నదిలో నీటి మట్టం గంటకు దాదాపు 4 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతుండటంతో, అధికారులు ముందుజాగ్రత్త చర్యగా పడవ రాకపోకలను నిలిపివేశారు.
ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షితమైన, ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లడం ప్రారంభించారు. వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. వారణాసి అంతటా మొత్తం 61 వరద సహాయక శిబిరాలను గుర్తించడంతో పాటు, అక్కడ ఆశ్రయం, ఆహారం, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ దీపాలు, వైద్య సదుపాయాల కల్పనకు ఏర్పాట్లు చేశారు.
వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నీటి మట్టాలు మరియు పరిస్థితులను పర్యవేక్షించడానికి 21 వరద పర్యవేక్షణ కేంద్రాలను (ఫ్లడ్ పోస్ట్లను) కూడా ఏర్పాటు చేశారు. సహాయక మరియు రక్షణ చర్యల కోసం 198 పడవలను అందుబాటులో ఉంచారు. గంగా, యమునా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నీటి ప్రవాహం పెరిగినట్లు భావిస్తున్నారు. ఇటీవల కురిసిన తుఫాన్ వర్షాల వల్ల స్థానిక నదీ వ్యవస్థలు దెబ్బతిన్నట్లు స్థానిక పర్యావరణవేత్తలు చెబుతున్నారు. గంగా నది ఉదృతం కావడంతో దాని ఉపనది వరుణ నదిలోనూ నీటి ప్రవాహం పెరిగింది.
దశాశ్వమేధ ఘాట్లో జరగాల్సిన గంగా హారతిని మరో చోట నిర్వహించనున్నారు. మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్ల వద్ద శవాల దహన స్థలాన్ని మార్చి, కాంక్రీట్ ఫ్లాట్ఫాంలపై నిర్వహిస్తున్నారు. నదికి వెళ్లే ఎంట్రీ పాయింట్లను టూరిస్టుల కోసం మూసివేశారు. అత్యవసర కార్యకలాపాల కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డిఆర్ఎఫ్), జల పోలీసులు, ప్రాదేశిక సాయుధ దళాల (పిఎసి) బృందాలను సిద్ధంగా ఉంచారు. వరదల తీవ్రత పెరిగితే, పశువుల మేత, తాగునీరు, పునరావాస సౌకర్యాలతో సహా పశుసంపద కోసం కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు.

More Stories
ఢిల్లీలో ప్రతి ముగ్గురు ఓటర్లలో ఒకరి ఓటు తొలగింపు!
`నీట్’ ఆందోళనకారులపై ఎఫ్ఐఆర్లు రద్దు.. `సుప్రీం’కు కేంద్రం వినతి
నేపాల్ వరదలు.. గండక్ నదిలో 10 మృతదేహాలు లభ్యం