ఢిల్లీలో ప్రతి ముగ్గురు ఓటర్లలో ఒకరి ఓటు తొలగింపు!

ఢిల్లీలో ప్రతి ముగ్గురు ఓటర్లలో ఒకరి ఓటు తొలగింపు!
ఢిల్లీలో చేపట్టిన ప్రత్యేకాధికార సమీక్ష (ఎస్ఐఆర్) ప్రక్రియ కారణంగా ముసాయిదా ఓటర్ల జాబితాలో సంచలనాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ల లిస్టు ప్రకారం ఢిల్లీలో ప్రతి ముగ్గురు ఓటర్లలో ఒకరి పేరు తొలగించారు. ఢిల్లీలోని మొత్తం 1.45 కోట్ల మంది ఓటర్లలో ఏకంగా 47.7 లక్షల మందిని సవరించిన జాబితా నుంచి మినహాయించారు. ‘సర్‌’ చేపట్టిన అన్నిరాష్ర్టాలూ, యూటీల్లో ముసాయిదా దశలోనే అత్యధిక శాతం ఓటర్ల తొలగింపు ఢిల్లీలో నమోదైందని, ఇక్కడ 33 శాతం మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారని అధికారులు చెప్పారు. కేవలం ఢిల్లీలోనే కాకుండా మహారాష్ట్రలోనూ ఇదే తరహా ప్రక్షాళన జరిగింది. అక్కడ ఉన్న 9.78 కోట్ల మంది ఓటర్లలో దాదాపు 2.07 కోట్ల మంది పేర్లు ముసాయిదా జాబితాలో కనిపించకపోవడం గమనార్హం.

నకిలీ ఓట్లను ఏరివేయడం, నివాసం మారిన వారిని, మరణించిన వారి పేర్లను తొలగించడమే లక్ష్యంగా ఈ భారీ కసరత్తు నిర్వహించారు. ఢిల్లీ సీఈఓ  అందించిన గణాంకాల ప్రకారం, రోహిణి ప్రాంతంలో డిజిటలైజేషన్ రేటు అత్యధికంగా 83.43 శాతంగా ఉండగా, తుగ్లకాబాద్‌లో అత్యల్పంగా 52.15 శాతంగా నమోదైంది. షాహీన్ బాగ్, జసోలా విహార్ వంటి ప్రాంతాల్లోని నివాసితులను—ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ నుండి వచ్చిన వలస కుటుంబాలను—2002 నాటి ఓటర్ల జాబితాతో అనుసంధానించడంలో బూత్ స్థాయి అధికారులకు   ఇబ్బందులు ఎదురయ్యాయి.

ముసాయిదా జాబితా విడుదలైన నేపథ్యంలో ఓటర్లకు తమ పేర్లను సరిచూసుకునే అవకాశాన్ని ఎన్నికల అధికారులు కల్పించారు. ఒకవేళ డ్రాఫ్ట్ లిస్టులో పేరు లేని అర్హులైన పౌరులు సెప్టెంబర్ 30వ తేదీ లోగా ‘ఫామ్ 6’ ద్వారా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.  అభ్యంతరాలు, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత సమగ్రమైన తుది ఓటర్ల జాబితాను నవంబర్ 4న అధికారికంగా ప్రచురించనున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును కాపాడుకునేందుకు ఓటర్లు వెంటనే తమ వివరాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.