కోర్టు నిబంధనలు ఉల్లంఘించినందుకు మమతపై ఎఫ్‌ఐఆర్

కోర్టు నిబంధనలు ఉల్లంఘించినందుకు మమతపై ఎఫ్‌ఐఆర్
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై హైకోర్టు నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆగష్టు 28, శుక్రవారం కోల్‌కతాలో తృణమూల్ ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం జరిగింది. టీఎంసీపీ అంటే టీఎంసీకి చెందిన విద్యార్థి విభాగం. కోల్‌కతా హైకోర్టు పలు సూచనలు, నిబంధనలతో అనుమతించింది. 
 
దీని ప్రకారం కోల్‌కతాలోని క్యాథెడ్రల్ రోడ్డులోని ఒకవైపు మాత్రమే కార్యక్రమం నిర్వహించుకోవాలి. కానీ, రెండోవైపు కూడా నిర్వాహకులు కార్యక్రమం నిర్వహించారు. వాహనాల రాకపోకలకు అడ్డుతగిలారు. ఇదే సమయంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా నేతలు ప్రవర్తించారు. బ్యారికెడ్లు దాటుకుంటూ, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించారు. 
 
దీంతో నిర్వాహకులపై హస్టింగ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇప్పటికే శుక్రవారం టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తాజాగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ అపు బైద్య ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. 
 
ఈ కార్యక్రమానికి మమతా బెనర్జీ హాజరు కావడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. కార్యక్రమాన్ని నిర్వహించిన ఇతర నేతలపై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పోలీసు ఫిర్యాదు ప్రకారం, గుంపు బారికేడ్లను పక్కకు నెట్టివేసి, శాంతిభద్రతల పరిరక్షణ కోసం మోహరించిన సిబ్బందితో తోపులాటకు దిగారు. కోర్టు నిర్దేశించిన సమయ పరిమితిని దాటి కార్యక్రమం కొనసాగిందని కూడా ఫిర్యాదులో ఆరోపించారు. 
 
ఈ ఆరోపిత ఉల్లంఘనలో పాల్గొన్న వారందరి పాత్రను దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్‌లో చేసిన ఆరోపణలు ఇంకా కోర్టులో రుజువు కావాల్సి ఉంది. వార్షిక టీఎంసీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల వేదిక, ఏర్పాట్లపై తలెత్తిన న్యాయపరమైన వివాదం నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీలోని ప్రత్యర్థి వర్గాలు సెంట్రల్ కోల్‌కతాలో కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ కలకత్తా హైకోర్టును ఆశ్రయించాయి.