ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్’ కు డాక్టర్ వైఎస్.అవార్డు – 2026

ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్’ కు డాక్టర్ వైఎస్.అవార్డు – 2026
దేశ వ్యవసాయ రంగం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి,  గ్రామీణ జీవనోపాధి రంగాలలో అందించిన  అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా ‘ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్’ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్) కు ‘డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి అవార్డు – 2026’ ను ప్రకటించారు. ఈ అవార్డు కింద రూ. 25 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు. 

సెప్టెంబర్ 2న న్యూఢిల్లీలోని ‘కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా’లో నిర్వహించే కార్యక్రమంలో ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ తరఫున ఆ సంస్థ ఛైర్‌పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఈ అవార్డును స్వీకరిస్తారని ట్రస్త్రీలు  డాక్టర్ కేవీపీ రామచందర్ రావు (మాజీ రాజ్యసభ సభ్యులు), డాక్టర్ జి. చిన్నారెడ్డి (వైస్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు), డాక్టర్ ఎన్. రఘువీరారెడ్డి (కాంగ్రెస్ సిడబ్ల్యుసి సభ్యులు) ప్రకటించారు.

భారతరత్న, దివంగత డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ మహోన్నత వారసత్వాన్ని ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ కొనసాగిస్తోంది. ఆయన శాస్త్రీయ నాయకత్వం మన దేశ హరిత విప్లవంలో, దేశాన్ని ఆహార కొరత నుంచి ఆహార స్వయం సమృద్ధి దిశగా నడిపించడంలో చారిత్రాత్మక పాత్ర పోషించింది.  దిగవంత   ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ  నాయకత్వంలో, ఆమె రాజకీయ సంకల్పం, వ్యవసాయ రంగానికి అందించిన బలమైన మద్దతు, డాక్టర్ స్వామినాథన్ సైంటిఫిక్ విజన్, భారతీయ రైతుల కృషి కలిసి దేశ ఆహార భద్రతకు బలమైన పునాదులు వేశాయి.

సుస్థిర వ్యవసాయం, ఆహార-పోషకాహార భద్రత, జీవవైవిధ్యం, గ్రామీణ జీవనోపాధి రంగాలలో విజ్ఞాన ఫలాలను రైతులకు, గ్రామీణ ప్రజలకు అందిస్తూ ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి గారి ప్రజా సంక్షేమ ఆశయాలను, రైతుపక్షపాత ఆలోచనలను కొనసాగించేందుకు ‘డాక్టర్ వైఎస్ఆర్ & డాక్టర్ కేవీపీ ఫౌండేషన్’ స్థాపించారు. వైఎస్సార్ ప్రజా జీవితం నిరంతరం రైతులు, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సాగింది. 

ఈ నేపథ్యంలో వ్యవసాయం, నీటిపారుదల, వైద్యం, విద్య వంటి రంగాలలో విశేష సేవలందించిన ప్రముఖ వ్యక్తులను, సంస్థలను సత్కరించడం, సమాజ పురోగతికి ఉపయోగపడే వ్యవసాయం తదితర కోర్సులలో ప్రతిభావంతులైన విద్యార్థులకు చేయూతనందించడం, సామాజిక సేవకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తులను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఫౌండేషన్ పనిచేస్తున్నది.

ఫౌండేషన్ చేపడుతున్న అవార్డులు, స్కాలర్‌షిప్‌లు, సంక్షేమ కార్యక్రమాలన్నీ డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి స్మృత్యర్థం నిర్వహిస్తున్నవే. ఆయన జీవితంలో చూపించిన కరుణ, ప్రజాసేవ, సమగ్ర అభివృద్ధి విలువల ఆధారంగా ఇవి కొనసాగుతున్నాయి. 2025లో ఈ ఫౌండేషన్ తొలి అవార్డును సుస్థిర, ప్రకృతి వ్యవసాయంలో విశేష కృషి చేసిన ‘సుభాష్ పాలేకర్ కృషి’ (ఎస్పీకే) కి ప్రధానం చేశారు.

అదే కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం, పరిశోధనలలో చేసిన కృషికి గాను ‘శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్’ ను గౌరవంగా సత్కరించారు. ఈ సత్కారాన్ని ఫౌండేషన్ తరఫున డాక్టర్ చదలవాడ సుధ, డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు స్వీకరించారు. 2026లో, ఫౌండేషన్ ‘ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రూ. 21 లక్షలతో నిధిని (స్కాలర్షిప్ కార్పస్) ఏర్పాటు చేసింది. 

దీని ద్వారా ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి స్కాలర్‌షిప్ అందజేస్తారు. వీటితో పాటు సమాజ సంక్షేమానికి కట్టుబడి సేవ చేస్తున్న పలువురు వ్యక్తులకు, సామాజిక కార్యక్రమాలు చేపట్టే  సంస్థలకు కూడా ఫౌండేషన్ మద్దతుగా నిలుస్తోంది.

‘డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి అవార్డు – 2026’ ద్వారా గ్రామీణ భారతానికి విశేష సేవలందించిన ఇద్దరు మహానాయకుల వారసత్వాలు ఒకచోటకు చేరాయి. వ్యవసాయ రంగానికి, ఆహార భద్రతకు డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ అందించిన చారిత్రాత్మక శాస్త్రీయ సేవలను, రైతులు, పేదల సంక్షేమం పట్ల డాక్టర్ వైఎస్. రాజశేఖర్ రెడ్డి గారి అంకితభావాన్ని ఈ అవార్డు ప్రతిబింబిస్తుంది