లండన్లో అమ్మే ఒక ఫాంటా క్యాన్లో 63 కేలరీలు ఉంటాయి. అదే బ్రాండ్ను భారతదేశంలో కొంటే, అందులో మూడు రెట్లు ఎక్కువ చక్కెర ఉంటుంది. అంతేకాకుండా, అందులో కృత్రిమ రంగు కూడా ఉంటుంది. ఐరోపాలోని ఆహార ఉత్పత్తులలో ఈ రంగు ఉన్నట్లయితే, దానిపై స్పష్టంగా ఆరోగ్య హెచ్చరికను ముద్రించాల్సి ఉంటుంది.
దేశంలో ప్యాకేజ్డ్ ఆహారాలు, సోడాలపై రెడ్ ఫ్లాగ్(ఎరుపు రంగు హెచ్చరికలు) లేబుళ్లను ముద్రించాలన్న ప్రతిపాదనను ప్రముఖ ఆహార సంస్థలు కోకాకోలా, నెస్లే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
భారతదేశంలో, ఈ రంగు పదార్థం గురించి క్యాన్ వెనుక భాగంలో చిన్న అక్షరాలతో మాత్రమే తెలియజేస్తారు. ప్యాక్ చేసిన ఉత్పత్తుల ముందు భాగంలో పోషకాహార హెచ్చరికలను తప్పనిసరి చేయాలన్న భారత ప్రయత్నాలను చాలాకాలంగా వ్యతిరేకిస్తున్న ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద కంపెనీలకు ఇది అనుకూలంగా ఉంది. ఫాంటాను తయారు చేసే కోకా-కోలా వంటి వినియోగదారుల దిగ్గజాలకు ప్రయోజనం చేకూరినట్లు కనిపిస్తుంది.
పరిశ్రమ అంచనాల ప్రకారం, భారతదేశంలోని 100 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ప్యాకేజ్డ్ ఆహార, పానీయాల మార్కెట్లో తయారయ్యే ఉత్పత్తులలో దాదాపు 80% కొవ్వు, చక్కెర, ఉప్పు అధికంగా ఉన్నవిగా పరిగణించవచ్చు. అంటే, పరిశ్రమ రంగుల ఆధారిత హెచ్చరిక లేబుళ్లను అవలంబిస్తే, ప్యాకేజింగ్ అంతా ఎరుపు రంగుతో నిండిపోతుందని ఇండ్ ఫుడ్ & బెవరేజ్ అసోసియేషన్కు చెందిన దీపక్ జాలీ నియంత్రణ సంస్థలతో జరిగిన మార్చి సమావేశంలో పేర్కొన్నారు.
భారతీయ వంటకాలు మరింత ఘాటైన రుచులను కలిగివుంటాయనే విషయాన్ని హెచ్చరిక లేబుళ్లు పరిగణలోకి తీసుకోలేవని పేర్కొంటూ, బదులుగా కంపెనీలు చక్కెర, కొవ్వు, ఉప్పు పరిమాణాలను సూచించే బ్లాక్ అండ్ వైట్ పట్టికను ప్రదర్శించాలని భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రతిపాదించింది.
అయితే దీనిపై ప్రజారోగ్య కార్యకర్తలు పిటిషన్ దాఖలు చేసిన దరిమిలా, సుప్రీంకోర్టు గత ఫిబ్రవరిలో హెచ్చరిక లేబుళ్లను పరిశీలించాలని నియంత్రణ సంస్థలను ఆదేశించింది. ఇజ్రాయెల్ దేశపు ఎరుపు, ఆకుపచ్చ సందేశ విధానాన్ని పరిశీలించాలని కూడా ఏజెన్సీకి సూచించింది. అయితే పరిశ్రమ ప్రతినిధులతో గత మార్చిలో సమావేశం ముగిశాక ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇంటర్ ప్రిటేటివ్ లేబులింగ్ అంశంపై వెనక్కి తగ్గింది.
ప్యాకేజింగ్పై అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించడం కష్టతరమన్న పరిశ్రమ వాదనను సమర్థిస్తూ కోర్టుకు తెలిపింది. దీనిపై న్యాయమూర్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, భారతదేశం తన పౌరుల సమగ్ర ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తున్నదనే విషయం ప్రపంచానికి తెలియాలని పేర్కొన్నారు. లాన్సెట్ జర్నల్లో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, 2050 నాటికి ఊబకాయం లేదా అధిక బరువుతో బాధపడగల 45 కోట్ల మంది భారతీయుల నడుము చుట్టుకొలత ప్రమాదంలో పడింది.
లేబులింగ్లో మరింత పారదర్శకత ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించగలదని నిపుణులు అంటున్నారు. వారి ప్రోత్సాహంతో, సుమారు 20 దేశాలు ప్యాక్ చేసిన ఆహార పదార్థాల ముందు భాగంలో వివరణాత్మక లేబుల్లను అవలంబించాయి. వీటిలో అధిక చక్కెర స్థాయిలను ఎరుపు రంగులో, తక్కువ కొవ్వు శాతాన్ని ఆకుపచ్చ రంగులో హైలైట్ చేయడం వంటివి ఉండవచ్చు.
రాయిటర్స్ సమీక్షించిన రికార్డింగ్ల ప్రకారం, పరిశ్రమ కార్యనిర్వాహకులతో మార్చిలో జరిగిన ఉద్రిక్త సమావేశం తర్వాత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెనక్కి తగ్గింది. అటువంటి హెచ్చరిక లేబుళ్లు గందరగోళంగా, ప్రభావహీనంగా ఉన్నాయని వారు వాదించారు. ఆహార పరిమాణ నియంత్రణను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని కూడా కార్యనిర్వాహకులు నియంత్రణ సంస్థలను కోరారు. నియంత్రణ సంస్థ పూర్వ ప్రతిపాదనలను వ్యతిరేకించిన భారతీయ లాబీలలో నెస్లే ఒక సభ్యురాలు. కానీ ఆ కంపెనీ 2013 నుండి బ్రిటన్లో స్వచ్ఛందంగా వివరణాత్మక లేబుళ్లను ఉపయోగిస్తోంది.

More Stories
తీవ్ర అసహనంతో కూడిన మేధో ఉగ్రవాదానికి ముగింపుగా భగవత్ సందేశం
ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్’ కు డాక్టర్ వైఎస్.అవార్డు – 2026
దేశీయ సంస్థలకే డీఆర్డీఓ క్షిపణి టెక్నాలజీ