ఇటీవల పంచదార ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం పంచదారను మళ్లించడమే కారణమని చెప్పడం సరికాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రయోజనం కోసం మళ్లించే పంచదార వాటా 2022-23లో సుమారు 12 శాతం నుండి 2025-26 నాటికి సుమారు 9 శాతానికి తగ్గిందని ప్రభుత్వం తెలిపింది.
“అంతేకాకుండా, ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న ఇథనాల్లో దాదాపు నాలుగింట మూడు వంతులు ధాన్యాల నుండి, ముఖ్యంగా మొక్కజొన్న నుండి వస్తోంది” అని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇటీవలి వారాల్లో చక్కెర ధరలు పెరిగాయి. జూలై 20, 2026న కిలోకు రూ. 48.18గా ఉన్న ధర, ఆగస్టు 20, 2026 నాటికి కిలోకు రూ. 55.70కి చేరింది.
ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, వినియోగదారులకు పంచదార అందుబాటులో ఉండేలా, ధరలు స్థిరంగా ఉండేలా చూసేందుకు అనేక చర్యలు తీసుకున్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, పంచదార ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి: ఆశించిన దానికంటే తక్కువ దేశీయ ఉత్పత్తి, పండుగ సీజన్ ముందు పెరిగిన డిమాండ్, వాతావరణ పరిస్థితుల వల్ల చెరకు పంటకు జరిగిన నష్టం, ప్రపంచవ్యాప్తంగా పంచదార సరఫరా తగ్గడం, పరిశ్రమలోని కొన్ని వర్గాల ఊహాజనిత వ్యాపారం లేదా నిల్వ చేయడం వంటివి ఇందులో ఉన్నాయి.
ప్రస్తుత సీజన్లో పంచదార ఉత్పత్తి సుమారు 306 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. చెరకు పండించే రాష్ట్రాలు మొదట దీనిని సుమారు 343 లక్షల మెట్రిక్ తన్నులుగా అంచనా వేశారు. చెరకులో ‘రెడ్ రాట్’ (ఎర్ర కుళ్ళు తెగులు), ‘టాప్ బోరర్’ (కొన తొలిచే పురుగు) తెగుళ్ల ప్రభావం, అలాగే అధిక వర్షాల వల్ల నీరు నిలిచిపోవడం వంటి కారణాల వల్ల ఉత్పత్తి ప్రభావితమైందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
“అంచనా వేసిన దానికంటే ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పటికీ, అక్టోబర్లో కొత్త క్రషింగ్ సీజన్ ప్రారంభమయ్యే వరకు దేశీయ అవసరాలను తీర్చడానికి సరిపడా చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయి” అని మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా, చక్కెర సరఫరా తగ్గడం అనేది కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి అని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది.
2026-27 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా చక్కెర కొరత సుమారు 33 లక్షల మెట్రిక్ తన్నులు ఉంటుందని అంచనా వేశారు. వాతావరణ పరిస్థితులపై ఆందోళనలు ప్రపంచవ్యాప్త అంచనాలపై మరింత ప్రభావం చూపాయి. దీని ఫలితంగా, అంతర్జాతీయ చక్కెర ధరలు 2026 జూన్ 30 నాటికి ఉన్న టన్నుకు $474 నుండి 2026 ఆగస్టు 20 నాటికి టన్నుకు $552కి భారీగా పెరిగాయి. అంటే రెండు నెలల కంటే తక్కువ వ్యవధిలోనే 16 శాతానికి పైగా పెరుగుదల నమోదైందని ఆ ప్రకటన పేర్కొంది.
సాధారణంగా, దేశంలో వార్షిక పంచదార ఉత్పత్తి సుమారు 320-340 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉండగా, దేశీయ వినియోగం సుమారు 280-290గా ఉంటుంది. మిగులు ఉత్పత్తి ఉన్న సంవత్సరాల్లో, అదనపు నిల్వలు పంచదార మిల్లుల నిధులను నిలిపివేస్తాయి. చెరకు రైతులకు చెల్లింపులలో జాప్యానికి దారితీయవచ్చు. అదనపు చక్కెరను ఇథనాల్ తయారీకి మళ్లించడం ఈ నిర్మాణాత్మక సమస్యను పరిష్కరించడంలో సహాయపడిందని, చక్కెర మిల్లుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
“దీని ఫలితాలు కనిపిస్తున్నాయి. 2026 ఆగస్టు 20 నాటికి, 2025-26 చక్కెర సీజన్కు సంబంధించిన చెరకు బకాయిలలో 97 శాతం రైతులకు ఇప్పటికే చెల్లించడం జరిగింది,” అని అది పేర్కొంది. చక్కెర మిల్లుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వల్ల ప్రభుత్వ మద్దతుపై వాటి ఆధారపడటం కూడా తగ్గింది. 2014 నుండి 2021 మధ్య చక్కెర పరిశ్రమకు సుమారు రూ. 14,600 కోట్ల సబ్సిడీని అందించినప్పటికీ, 2021-22 నుండి అటువంటి సబ్సిడీ ఏదీ ప్రకటించబడలేదని అది పేర్కొంది.
“అదే సమయంలో, వినియోగదారులకు పంచదార ధరలు దీర్ఘకాలంలో స్థిరంగా ఉన్నాయి. ఆగస్టు 2024 నుండి జూలై 2026 మధ్య ఇవి ఏటా కేవలం 3 శాతం మాత్రమే పెరిగాయి,” అని ఆ ప్రకటన తెలిపింది. ముఖ్యంగా, భారతదేశంలోని పంచదార డీలర్లపై 2026 ఆగస్టు 1 నుండి నవంబర్ 30 వరకు 400 టన్నుల నిల్వ పరిమితి విధించారు. సెప్టెంబర్ 1 నుండి, భారీ వినియోగదారులు 15 రోజుల వినియోగానికి మించి పంచదార నిల్వలను ఉంచుకోవడానికి అనుమతించరు.

More Stories
వారంలో 10 బిలియన్ డాలర్లు పెరిగిన విదేశీ మారక నిల్వలు
కేంద్రం అనుమతి నిరాకరణతో రేవంత్ అమెరికా పర్యటన రద్దు
దేశ నిర్మాణంలో యువత పాత్రపై ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో విస్తృతంగా చర్చ