ఝార్ఖండ్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి.. నిరసనకారుల ఆగ్రహం 

ఝార్ఖండ్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి.. నిరసనకారుల ఆగ్రహం 
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జెపిఎస్సి) 11 నుండి 13వ పరీక్షలు, సంబంధిత నియామకాలను రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు గురువారం స్టే విధించిన నేపథ్యంలో, ఆ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను విద్యార్థి నిరసనకారులు తీవ్రంగా విమర్శించారు. ఈ రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొత్తగా నియమితులైన అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ మధ్యంతర ఉపశమన ఉత్తర్వును జారీ చేసింది. 
 
న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుపై తాను వ్యాఖ్యానించనని, అయితే విచారణ సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రశ్నిస్తున్నానని విద్యార్థి నాయకుడు రవీంద్ర పాశ్వాన్ స్పష్టం చేశారు. తమ డిమాండ్లన్నింటినీ అంగీకరించామని, పరీక్షలను రద్దు చేశామని, సరైన విచారణకు ఆదేశించామని ప్రభుత్వం గతంలో తమకు హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. “ఈ రోజు ప్రభుత్వంలో అటువంటి చిత్తశుద్ధి మాకు కనిపించలేదు,” అని పాశ్వాన్ పేర్కొన్నారు. 
 
ఒకవైపు పరీక్షలను రద్దు చేయడం ద్వారా ఆందోళనను ముగించాలని ప్రయత్నిస్తూనే, మరోవైపు నియామక ప్రక్రియను కొనసాగనివ్వడం ద్వారా ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ప్రదర్శించిందని, కోర్టులో ప్రభుత్వ న్యాయవాది ఎటువంటి వాదనలు వినిపించలేదని ఆయన ఆరోపించారు. “మేము జార్ఖండ్ ప్రభుత్వాన్ని నమ్మాము. ముఖ్యమంత్రి విద్యార్థుల విషయంలో రాజకీయాలు చేయరని అనుకున్నాము. కానీ ఈ రోజు ఆయన అదే చేస్తున్నారు,” అని ఆయన జోడించారు. 
 
శుక్రవారం నాడు రాష్ట్రంలోని మొత్తం 24 జిల్లాల్లోనూ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేయడం ద్వారా విద్యార్థులు తమ నిరసనను ఉధృతం చేస్తారని పాశ్వాన్ ప్రకటించారు. జెపిఎస్సి- జెఎసిఎస్సి రిఫార్మ్ మంచ్  అధికారిక `ఎక్స్’ ఖాతా కూడా ప్రభుత్వ ద్వంద్వ వైఖరి ఆరోపణలను బలపరిచింది. 
 
ఒక పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు: “ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఇకపై అంగీకరించలేము. ప్రభుత్వ ద్వంద్వ విధానం, కపట స్వభావం ఇప్పుడు విద్యార్థుల ముందు పూర్తిగా బయటపడ్డాయి. ప్రభుత్వ నిర్ణయంపై గౌరవనీయ న్యాయస్థానం స్టే విధించిన తర్వాత, రద్దు చేసిన తన నిర్ణయాన్ని ప్రభుత్వం కోర్టులో పూర్తి పట్టుదల, చిత్తశుద్ధితో సమర్థించుకుంటోందా లేదా అన్నదే అతిపెద్ద ప్రశ్న? ప్రభుత్వం తన వాదనను కోర్టులో పూర్తి దృఢత్వంతో వినిపించకపోతే, రద్దు నిర్ణయాన్ని నిలబెట్టుకోవడంలో దానికి చిత్తశుద్ధి ఉందని విద్యార్థులు ఏ ప్రాతిపదికన నమ్ముతారు? ప్రభుత్వపు ఈ వైఖరే విద్యార్థులను మరోసారి ఆందోళన బాట పట్టేలా చేస్తుంది.”