విద్యార్థుల నిరసన అంశంపై చర్చకు అమిత్ షా సిద్ధం

విద్యార్థుల నిరసన అంశంపై చర్చకు అమిత్ షా సిద్ధం

పార్లమెంట్‌లో కొద్ది రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడనుంది. ఇటీవల సీజేపీ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై జరిగిన దాడి గురించి సమాధానం ఇచ్చేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంగీకరించారు. ఈ విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, హోం మంత్రి అమిత్‌ షా కూడా సమాధానం ఇస్తారని కిరణ్ రిజిజు ప్రకటించారు.

లోక్‌సభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో, అమిత్ షా స్పందించేంత వరకు ఎలాంటి చర్చలు జరగవని ఐక్య ప్రతిపక్షం స్పష్టం చేసిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. రామ మందిర విరాళాల దొంగతనం ఆరోపణలపై చర్చ జరపాలని కూడా ప్రతిపక్షం డిమాండ్ చేసింది.

విద్యార్థులపై జరిగిన దాడికి హోం మంత్రి రాజీనామా చేయాలని గతంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. తర్వాత రాహుల్ కాస్త వెనక్కు తగ్గారు. హోం మంత్రి రాజీనామా అవసరం లేదని, సభలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఈ అంశంపై కొద్ది రోజులుగా సభలో అందోళన చేస్తున్నాయి. 
 
మరోవైపు విద్యార్థులపై దాడి తర్వాత నుంచి అమిత్ షా సభకు హాజరు కాలేదు. దీంతో ఆయన సభకు రావాలని, సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై కిరణ్ రిజిజు సోమవారం సభలో మాట్లాడుతూ విద్యార్థులపై దాడి అంశంపై పూర్తిస్థాయిలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే, దీనికి ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ఇదే సమయంలో హోం మంత్రి చెప్పబోయే సమధానాల్ని కూడా వినాలని సూచించారు. సభకు అడ్డుతగలడం సరికాదని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. 
 
అయినప్పటికీ, సభలో ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. సభా కార్యక్రమాలకు అడ్డుతగిలాయి. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. సోమవారం కేంద్రం నాలుగు బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. వీటిలో ట్రిబ్యునల్ రిఫార్మ్స్ బిల్, 2026కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఒకపక్క ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నా ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుపై సభలో ఎలాంటి చర్చా జరగకపోవడం విశేషం. అంతకుముందు సభలో వివిధ పక్షాలు వేర్వేరు అంశాలపై ఆందోళన చేశాయి. యూపీలోని రామ మందిరం విరాళాలపై చర్చించాలని ఎస్పీ డిమాండ్ చేసింది.