* ప్రియాంక గాంధీకి అభ్యంతరం వ్యక్తం చేస్తూ 215 మంది విద్యావేత్తల బహిరంగ లేఖ
ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటిని ఉద్దేశించి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ‘గోమూత్ర నిపుణుడు’ అని చేసిన వ్యాఖ్యపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, వైస్-ఛాన్సలర్లు, మాజీ వైస్-ఛాన్సలర్లతో సహా 215 మందికి పైగా విద్యావేత్తలు ఆమెకు బహిరంగ లేఖ రాశారు. ఈ వ్యాఖ్య కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదని, విద్యాసంబంధ చర్చలు జరగాల్సిన తీరుకు కూడా సంబంధించినదని సంతకాలు చేసినవారు పేర్కొన్నారు.
నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన హైపవర్డ్ కమిటీలో కామకోటి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ కమిటీలో గోమూత్ర నిపుణుడిని నియమించినట్లు ప్రియాంకా గాంధీ తన లోక్సభ ప్రసంగంలో చేసిన ఆరోపణలను ఖండిస్తూ దేశంలోని విద్యావేత్తలు కాంగ్రెస్ నేతకు ఈ బహిరంగ లేఖ రాశారు. రాజకీయాల కోసం ఉన్నత విద్యావేత్తను అపహాస్యం చేయరాదని వారు ఆమెకు హితవు చెప్పారు.
ఆ లేఖ ప్రకారం, ఒక నిపుణుడి అభిప్రాయాలతో విభేదాలను వ్యక్తిగత ముద్రల ద్వారా కాకుండా, హేతుబద్ధమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. దేశంలోని అత్యంత పటిష్టమైన శాస్త్రీయ, సాంకేతిక విద్యాసంస్థలో ప్రొఫెసర్ కామకోటి డైరెక్టర్గా ఉన్నట్లు ఆ లేఖలో వారు గుర్తు చేసారు. ఓ ప్రఖ్యాత విద్యావేత్తకు ముద్ర వేయడం సరికాదని పేర్కొంటూ ఆయనలోని శాస్త్రీయ దృక్కోణాన్ని అర్థం చేసుకోవాలని వారు స్పష్టం చేశారు.
“ప్రొఫెసర్ కామకోటి భారతదేశంలోని అగ్రశ్రేణి శాస్త్రీయ, సాంకేతిక సంస్థలలో ఒకదానికి అధిపతిగా ఉన్నారు. ఆయన ఐఐటి మద్రాస్ నుండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఎం.ఎస్., పిహెచ్.డి. డిగ్రీలు పొందారు. ఆయన 150కి పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారు. 50కి పైగా ఆర్&డి ప్రాజెక్టులలో పాలుపంచుకున్నారు” అని వారు తెలిపారు.
పైగా,”ఆయన పేరు మీద డిఆర్డిఓ అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డు, ఇండియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ టెక్నో విజనరీ అవార్డుతో సహా అనేక గౌరవాలు, ప్రశంసలు ఉన్నాయి. భారతదేశపు మొట్టమొదటి ఇండస్ట్రీ గ్రేడ్ మైక్రోప్రాసెసర్ రూపకల్పన వెనుక ఆయనే ప్రధాన చోదక శక్తి. చెప్పనవసరం లేదు, ఆయన దేశంలోని అగ్రశ్రేణి టెక్ మేధావులలో ఒకరు,” అని ఆ లేఖలో వారు పేర్కొన్నారు.
“ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటిని ‘గోమూత్ర నిపుణుడు’ అని మీరు అభివర్ణించినట్లు వచ్చిన వార్తలపై మా నిరాశను వ్యక్తం చేయడానికి ఈ లేఖ రాస్తున్నాము. అది వ్యంగ్యంగా చేసినా లేదా రాజకీయ వాక్చాతుర్యంతో చేసినా, అటువంటి వర్ణన ఒక వ్యక్తికి మించి ఆందోళనలను రేకెత్తిస్తుంది. ప్రొఫెసర్ కామకోటి భారతదేశంలోని అగ్రశ్రేణి శాస్త్రీయ, సాంకేతిక సంస్థలలో ఒకదానికి అధిపతి,” అని ఆ లేఖలో పేర్కొన్నారు.
ప్రతి విద్యావేత్తకు సిద్ధాంతాలను ప్రతిపాదించడానికి, సాంప్రదాయ జ్ఞానాన్ని చర్చించడానికి, శాస్త్రీయ సంభాషణలలో పాల్గొనడానికి హక్కు ఉందని సంతకాలు చేసినవారు వాదించారు. ఆ లేఖలో ఇంకా ఇలా పేర్కొన్నారు: “ఒక పండితుని అభిప్రాయాల సారాంశంతో నిమగ్నం కాకుండా, కేవలం ఒక ముద్ర వేసి కొట్టిపారేయడం, ప్రతి పౌరుడు పెంపొందించుకోవాలని మన రాజ్యాంగం పిలుపునిచ్చే శాస్త్రీయ దృక్పథాన్నే దెబ్బతీసే ప్రమాదం ఉంది.”
“శాస్త్రీయ దృక్పథం అంటే కేవలం అసాధారణమైన ఆలోచనల పట్ల సందేహించడం మాత్రమే కాదు; వాదనలను అంగీకరించే లేదా తిరస్కరించే ముందు వాటిని నిష్పక్షపాతంగా పరిశీలించే సంసిద్ధత కూడా అంతే ముఖ్యం” అని తెలిపారు. ఒకప్పుడు అసంభవంగా భావించిన అనేక ఆలోచనలు చివరికి శాస్త్రీయ ధ్రువీకరణ పొందాయని, విస్తృతంగా ఆమోదించిన అనేక నమ్మకాలు ఆ తర్వాత తిరస్కరించబడ్డాయని చరిత్ర మనకు గుర్తు చేస్తుందని వారు పేర్కొన్నారు.
గత ఏడాది జనవరిలో, చెన్నైలో గోమూత్రం ఔషధ ప్రయోజనాలను ప్రశంసిస్తూ కామకోటి చేసిన ఒక వీడియో ప్రతిపక్షాలు, హేతువాద వర్గాల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. గోమూత్రానికి యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఫంగల్ గుణాలు ఉన్నాయని, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి అనారోగ్యాలను నయం చేయగలదని ఆయన తెలిపారు.

More Stories
పంజాబ్లో పేపర్ లీకేజీలపై ఆప్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన
ఈ20 పెట్రోల్ వల్ల మైలేజీ 2-6 శాతం తగ్గవచ్చు
వందేభారత్ రైలు, చీనాబ్ బ్రిడ్జ్లపై సోనమ్ వాంగ్చుక్ ప్రశంసలు