10 నుంచి బెళగావిలో ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ ల సమావేశాలు 

10 నుంచి బెళగావిలో ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ ల సమావేశాలు 
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వార్షిక అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ ల సమావేశాలు ఈ సంవత్సరం కర్ణాటకలోని బెళగావిలో ఈ నెల 10, 11, 12 తేదీలలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంత ప్రచారకులు, సహ ప్రాంత ప్రచారకులు, క్షేత్ర ప్రచారకులు, సహ క్షేత్ర ప్రచారకులు పాల్గొంటారని ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. 
 
సంఘ్ వ్యవస్థాగత నిర్మాణం ప్రకారం, మొత్తం 11 క్షేత్రాలు, 46 ప్రాంతాల నుండి కార్యకర్తలు హాజరవుతారని భావిస్తున్నారు. వీటితో పాటు, సంఘ్ ప్రేరణతో నడిచే 32 సంస్థలకు చెందిన అఖిల భారతీయ సంఘటన కార్యదర్శులు కూడా ఇందులో పాల్గొంటారు. 2026 మార్చిలో సమల్ఖా (హర్యానా)లో జరిగిన ‘ప్రతినిధి సభ’ అనంతరం, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో దేశవ్యాప్తంగా వివిధ స్థాయిలలో సంఘ్ శిక్షణా శిబిరాలు నిర్వహించారు. 
 
ఈ సమావేశంలో శాఖా స్థాయిలో ‘కార్య యోజన’ (వార్షిక ప్రణాళికలు) అమలుకు సంబంధించిన అంశాలపై సమగ్ర చర్చలు జరుగుతాయి. సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టిన శాఖా కార్య విస్తరణను ఈ సమావేశం సమీక్షిస్తుంది. అలాగే శాఖల విస్తరణను గరిష్ట స్థాయికి చేర్చడానికి అవసరమైన ప్రణాళికలపై చర్చిస్తుంది.  2026 నాటి సంఘ్ శిక్షణా శిబిరాల నివేదికలు, సమీక్ష, శతాబ్ది సంవత్సరంలో పూర్తయిన కార్యక్రమాల సమీక్ష, మిగిలిన నిర్ణీత కార్యక్రమాల ప్రణాళిక, 2026–27 సంవత్సరానికి సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ ‘ప్రవాస యోజన’ (పర్యటన ప్రణాళికలు) వంటి అంశాలు ఈ చర్చలలో భాగంగా ఉంటాయి. 
 
సంఘ శతాబ్ది సంవత్సరం (2025–26) మిగిలిన కార్యక్రమాలు విజయదశమి వరకు, అంటే 20 అక్టోబర్ 2026 వరకు కొనసాగుతాయి. సమావేశానికి హాజరయ్యే ప్రచారక్‌లు ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన అనుభవాలు, జనాభా గణన వంటి ముఖ్యమైన సమకాలీన అంశాల గురించి కూడా చర్చిస్తారు. సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే, సహా కార్యవహ్ లు డాక్టర్ కృష్ణగోపాల్, సీఆర్ ముకుంద, అరుణ్ కుమార్, రామ్‌దత్, అలోక్ కుమార్, అతుల్ లిమాయే తదితరులు మార్గదర్శనం చేస్తారు.ఈ సమావేశాలలో పాల్గొనేందుకు డా. భగవత్ జులై 6న బెలగావికి చేరుకుంటారు.