‘రాహుల్‌గాంధీ క‌న‌బ‌డుట‌లేదు’ .. ఢిల్లీలో పోస్ట‌ర్ల కలకలం

‘రాహుల్‌గాంధీ క‌న‌బ‌డుట‌లేదు’ .. ఢిల్లీలో పోస్ట‌ర్ల కలకలం
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ కలకలం రేగింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ‘కనిపించడం లేదు’ (మిస్సింగ్) అంటూ ఆదివారం ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాల్లో వెలిసిన పోస్టర్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాహుల్‌గాంధీ తాజా విదేశీ పర్యటనను లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్‌లో ఈ పరిణామం సరికొత్త మలుపు తిప్పింది.

ఢిల్లీలోని ఫిరోజ్‌షా రోడ్డుతోపాటు పలు ప్రధాన కూడళ్లలో రాహుల్‌గాంధీ ఫొటోతో కూడిన ‘మిస్సింగ్’ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. అయితే ఈ పోస్టర్లను ఎవరు అంటించారనేది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియరాలేదు. పార్లమెంట్ సమావేశాలు, కీలక ఎన్నికలు, లేదా పార్టీ అంతర్గత ప్రాముఖ్యత కలిగిన సమయాల్లో రాహుల్‌గాంధీ దేశంలో ఉండరంటూ శనివారం నుంచే బీజేపీ తన విమర్శల పదును పెంచిన మరుసటి రోజే ఈ పోస్టర్లు కలకలం రేపడం గమనార్హం.

ఈ అంశంపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ ఎంపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్‌గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేత పదవిని ‘లీడర్ ఆఫ్ పర్యటన్ అండ్ పార్టీయింగ్’ గా మార్చేశారని ఎద్దేవాచేశారు. పార్లమెంట్ నడుస్తున్నప్పుడు లేదా దేశానికి, సొంత పార్టీకి ఆయన అవసరం ఉన్నప్పుడల్లా విదేశాలకు వెళ్లడం రాహుల్‌కు అలవాటుగా మారిందని, ప్రజల కంటే ఆయన టూరిజానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.

“రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడి పేరును ‘పర్యాటక, విహార నాయకుడు’గా మార్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడూ చేసేది అదే – పర్యటకం, ప్రయాణాలు, విహారాలు,” అని పూనావాలా ఒక వీడియో ప్రకటనలో ధ్వజమెత్తాdరు. గాంధీ తన రాజకీయ బాధ్యతల కంటే విదేశీ పర్యటనలకే నిరంతరం ప్రాధాన్యత ఇస్తారని ఆయన ఆరోపించారు. 

 
“పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడల్లా, ఎన్నికలు జరుగుతున్నప్పుడల్లా లేదా కాంగ్రెస్‌కు ఆయన అవసరం వచ్చినప్పుడల్లా, రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తారు. ఆయన పార్లమెంటుకు, ప్రజలకు, చివరికి దేశానికి కూడా ప్రాధాన్యత ఇవ్వరు—పర్యాటకానికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు,” అని ఆ బీజేపీ నాయకుడు పేర్కొన్నారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పోలుస్తూ, మోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరంగా ప్రజా పదవిలో పనిచేశారని, అయితే రాహుల్ గాంధీ మాత్రం తాను “సెలవుల మూడ్”గా అభివర్ణించిన స్థితిలోనే ఉంటున్నారని పూనావాలా ఎద్దేవా చేశారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా 9,000 రోజులకు పైగా పనిచేసి, దేశంలో అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచారు” అని గుర్తు చేశారు. 
 
మరోవంక, గాంధీ విదేశీ పర్యటనల నిధులపై కూడా ఆ బీజేపీ నాయకుడు ప్రశ్నలు లేవనెత్తారు. కాంగ్రెస్ నాయకుడు ఖర్చు మూలాలను వెల్లడించకుండా విదేశీ పర్యటనల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. గాంధీ అంతర్జాతీయ కార్యక్రమాలకు ‘భారత వ్యతిరేక ఎజెండా’ను ప్రోత్సహించే ‘అనుమానాస్పద సంస్థలు’ మద్దతు ఇస్తున్నాయని ఆయన ఆరోపించారు.
అంతేకాకుండా, ముఖ్యమైన పార్లమెంటరీ, రాజకీయ పరిణామాల సమయంలో ఆయన మరోసారి ‘కనిపించకుండా పోతారని’ కూడా ఆరోపించారు. ఈ వార్త రాసే సమయానికి, పోస్టర్లపై గానీ, బీజేపీ ఆరోపణలపై గానీ కాంగ్రెస్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు.