తృణమూల్ నేత అనుచరురాలి వద్ద రూ. 4.4 కోట్ల విలువైన బంగారం  

తృణమూల్ నేత అనుచరురాలి వద్ద రూ. 4.4 కోట్ల విలువైన బంగారం  
బిధాన్‌నగర్ మాజీ మేయర్, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత సబ్యసాచి దత్తా అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తులో దత్తాకు అత్యంత సన్నిహితురాలిగా భావించే నాడియా జిల్లా పరిషత్ సభ్యురాలు, టీఎంసీ నేత టీనా భౌమిక్ సాహా నివాసం నుండి పశ్చిమ బెంగాల్ పోలీసులు దాదాపు 3 కిలోల బంగారు ఆభరణాలను (విలువ రూ. 4 కోట్లకు పైగా) స్వాధీనం చేసుకున్నారు. 
 
దత్తా విచారణలో లభించిన సమాచారం ఆధారంగా, బిధాన్‌నగర్ సౌత్ పోలీసులు నాడియా జిల్లాలోని తెహట్టాలో ఉన్న సాహా నివాసంలో రాత్రిపూట ఈ సోదాలు నిర్వహించారు.  అక్రమ వసూళ్లు, ఆదాయానికి మించిన ఆస్తుల కలిగి ఉండటం వంటి ఆరోపణలపై ఈ నెల ప్రారంభంలోనే మాజీ మేయర్ దత్తాను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బరాసత్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు.
 
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, దత్తా ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్న అధికారులు ఆయన రాజర్‌హట్ నివాసం, ఒక బ్యాంక్ లాకర్ నుండి పత్రాలు, రశీదులు, ఇతర రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇవి భారీ మొత్తంలో బంగారు ఆభరణాల కొనుగోళ్లను సూచిస్తున్నాయి. గతంలో జరిపిన సోదాల్లో కూడా పెద్ద మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. 
 
కొత్త సమాచారం ఆధారంగా, దత్తాను వెంటబెట్టుకుని వెళ్ళిన పోలీసు బృందాలు సాహా నివాసంలో అర్ధరాత్రి సోదాలు నిర్వహించాయి. స్వాధీనం చేసుకున్న  బంగారంలో కొంత భాగం అక్రమ వసూళ్లు, లెక్కల్లో చూపని లావాదేవీల ద్వారా సమకూరిన సొమ్ముతో ముడిపడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు, అయితే దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని అధికారులు స్పష్టం చేశారు.  
ఆభరణాల మూలం, అవి ఆమె వద్దకు ఎలా వచ్చాయనే విషయాలపై దర్యాప్తు అధికారులు ఇప్పుడు టీనా భౌమిక్ సాహాను ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు వివరాల గురించి పోలీసులు గోప్యత పాటిస్తున్నప్పటికీ, ఆస్తుల ఆర్జన, దాచిపెట్టడానికి సంబంధించిన నెట్‌వర్క్‌ను గుర్తించడంలో ఈ స్వాధీనం కీలక ఆధారాలను అందించగలదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఈ స్వాధీనం వ్యవహారం సంచలనం సృష్టించిన ఈ దర్యాప్తుకు కొత్త కోణాన్ని జోడించింది. దత్తాకు చెందిన ఇతర అనుచరుల వద్ద కూడా ఈ కేసుతో సంబంధం ఉన్న ఆస్తులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో అధికారులు ఇప్పుడు పరిశీలిస్తున్నారు.