భారత్‌ నుంచి యూఏఈ బ్రహ్మోస్‌ క్షిపణులను కొనుగోలు

భారత్‌ నుంచి యూఏఈ బ్రహ్మోస్‌ క్షిపణులను కొనుగోలు

భారత దేశం తన ప్రతిష్ఠాత్మక బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ క్షిపణి ఆకాశ్‌తీర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి విక్రయించే దిశగా చర్చలు జరుపుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తమ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు యూఏఈ ఆసక్తి కనబరుస్తున్న తరుణంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

రాయిటర్స్ మీడియా సంస్థ కథనం ప్రకారం ఈ చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ వేగంగా ముందుకు సాగుతున్నాయి. భారత్-రష్యాల సంయుక్త భాగస్వామ్యంలో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణులలో ఒకటిగా గుర్తింపు పొందింది. శబ్దవేగం కంటే మూడు రెట్లు వేగంతో (మాక్ 3) ప్రయాణించగల ఈ క్షిపణిని భూమి, సముద్రం, గగనతలం నుంచి ప్రయోగించవచ్చు. 

దీని పరిధి సుమారు 290 కిలోమీటర్లు. ఇక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ‘ఆకాశ్‌తీర్’, గగనతలం నుంచి ఎదురయ్యే ముప్పులను వేగంగా పసిగట్టి స్పందించే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ వ్యవస్థ. సాంప్రదాయకంగా అమెరికా వంటి పాశ్చాత్య దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసే యూఏఈ, ఇప్పుడు తన రక్షణ అవసరాల కోసం ఇతర దేశాల వైపు కూడా దృష్టి సారిస్తోంది. 

యూఏఈ వద్ద ఇప్పటికే అమెరికా తయారీ థాడ్, పేట్రియాట్ వంటి శక్తివంతమైన రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. వీటికి అదనంగా ఆకాశ్‌తీర్ వ్యవస్థను జోడించడం ద్వారా తమ కమాండ్ అండ్ కంట్రోల్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  బ్రహ్మోస్ జాయింట్ వెంచర్‌లో రష్యా భాగస్వామిగా ఉన్నందున ఈ విక్రయానికి మాస్కో ఆమోదం తప్పనిసరి. అయితే రష్యా-యూఏఈ మధ్య ఉన్న సత్సంబంధాల దృష్ట్యా ఇది అడ్డంకి కాకపోవచ్చని తెలుస్తోంది. ఈ చర్చలు భారత్-యూఏఈ మధ్య బలపడుతున్న వ్యూహాత్మక సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.