భారత్కు చెందిన కీలక రక్షణ వ్యవస్థల నిర్వహణ, సాంకేతిక మద్దతు కోసం అమెరికా 428.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.3,600 కోట్లకు పైగా) విలువైన రెండు రక్షణ సహాయ ప్యాకేజీలకు ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలను కొత్త ఆయుధాల కొనుగోలు కోసం కాకుండా ఇప్పటికే భారత సైన్యంలో సేవలందిస్తున్న అపాచీ యుద్ధ హెలికాప్టర్లు, ఎం777ఏ2 అల్ట్రా-లైట్ హోవిట్జర్లకు అవసరమైన నిర్వహణ, సాంకేతిక సహాయం, విడిభాగాల సరఫరా, శిక్షణ సేవలను అందించనుంది.
అమెరికా విదేశీ సైనిక విక్రయాల (ఎఫ్ఎంఎస్) కార్యక్రమాన్ని నిర్వహించే డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ (డీఎస్సీఏ) జూన్ 17న ఈ సర్వీసులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. గత నెల మే 18నే అమెరికా విదేశాంగ శాఖ భారతదేశానికి ఈ సేవలను అందించేందుకు కాంగ్రెస్కు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. దీంతో భారత్ అమ్ములపొదిలోని కీలక ఆయుధాల నిర్వహణ, లాజిస్టిక్స్, శిక్షణ, సాంకేతిక సాయం వంటి వాటికి ఇబ్బంది ఉండదు.
అమెరికా ఇవ్వనున్న 428.2 మిలియన్ డాలర్ల ప్యాకేజీలో 198.2 మిలియన్ డాలర్లను ఏహెచ్-64ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్ల నిర్వహణ కోసం కేటాయించారు. ఇందులో ఇంజినీరింగ్ సేవలు, సాంకేతిక సహాయం, లాజిస్టిక్ మద్దతు, శిక్షణ వంటి అంశాలు ఉన్నాయి. ఈ ప్యాకేజీకి బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ సంస్థలు ప్రధాన కాంట్రాక్టర్లుగా ఉంటాయి. మరో 230 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ఎం-777 ఏ2 అల్ట్రా-లైట్ హోవిట్జర్ తుపాకుల నిర్వహణకు కేటాయించారు.
దీనిలో విడిభాగాలు, సాంకేతిక సహాయం, శిక్షణ, లాజిస్టిక్ మద్దతు వంటి సేవలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన కాంట్రాక్టర్గా బీఏఈ సిస్టమ్స్ వ్యవహరించనుంది. ఈ ప్రతిపాదిత ఒప్పందం ద్వారా భారత్తో వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అమెరికా రక్షణ శాఖ పేర్కొంది. ఇండో- పసిఫిక్ ప్రాంతం, దక్షిణాసియాలో రాజకీయ స్థిరత్వం, శాంతి, ఆర్థిక అభివృద్ధికి భారత్ కీలక భాగస్వామిగా కొనసాగుతోందని అమెరికా అభిప్రాయపడింది.
భారత్ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడంలో ఈ సహాయ ప్యాకేజీ కీలక పాత్ర పోషిస్తుందని అమెరికా తెలిపింది. ప్రస్తుతం, భవిష్యత్లో ఎదురయ్యే భద్రతా సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని తెలిపింది. ఈ ప్రతిపాదిత సేవలు ప్రాంతీయ సైనిక సమతుల్యతను మార్చవని అమెరికా స్పష్టం చేసింది. అలాగే అమెరికా రక్షణ సన్నద్ధతపై కూడా ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని పేర్కొంది. భారత సాయుధ దళాలు ఈ సేవలు, పరికరాలను సమర్థంగా వినియోగించగలవని అమెరికా విశ్వాసం వ్యక్తం చేసింది.

More Stories
దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభం
వీణ విజయన్ కు మరోసారి ఈడీ నోటీసులు
టీఎంసీ బ్యాంకు ఖాతాల్లో రూ 440 కోట్లు ఫ్రీజ్