రాయచోటి `రహస్య జీవనం’లో హిందూ ప్రముఖుల హత్యకు ఆలీ కుట్ర!

 రాయచోటి `రహస్య జీవనం’లో హిందూ ప్రముఖుల హత్యకు ఆలీ కుట్ర!

తమిళనాడు నుంచి పారిపోయి వచ్చి అన్నమయ్య జిల్లా రాయచోటిలో సుదీర్ఘకాలం పాటు మారుపేర్లతో ఉన్న మహమ్మద్‌ అలీ ఎలియాస్‌ షేక్‌ మన్సూర్‌ ఎలియాస్‌ విజయ్‌కుమార్ షేక్‌ అమానుల్లా ఎలియాస్‌ అబూబకర్‌ సిద్ధిఖీలు దేశంలోని హిందూ మతానికి చెందిన ప్రముఖ నాయకులను హతమార్చేందుకు కుట్ర పన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) వెల్లడించింది. 

గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఉద్దేశించిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కేసులో రెండవ నిందితుడైన షేక్ మన్సూర్ అలియాస్ మహమ్మద్ అలీ అలియాస్ విజయకుమార్‌పై ఎన్ఐఏ   విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో శుక్రవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. గతంలో ఛార్జిషీట్ దాఖలు చేసిన నిందితుడు షేక్ అమానుల్లా అలియాస్ అబూబకర్ సిద్ధిఖీకి సన్నిహితుడిగా, సహ కుట్రదారుడిగా గుర్తించిన మహమ్మద్ అలీని 2025 డిసెంబర్‌లో అరెస్టు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి ఈ కేసును ఎన్ఐఏ స్వీకరించి, ఇప్పటివరకు షేక్ అమానుల్లాతో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది. షేక్ అమానుల్లా నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు మరియు ఇతర నేరారోపణ సామాగ్రి ఆధారంగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో అతనిపై ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 1999 నాటి బాంబు పేలుడు కేసుకు సంబంధించి తమిళనాడు నుంచి పరారైన మహమ్మద్ అలీ, అరెస్టు అయ్యే సమయానికి ఒక నకిలీ గుర్తింపుతో జీవిస్తున్నట్లు తేలిందని ఎన్ఐఏ తెలిపింది. 

మోసపూరితంగా పొందిన ప్రభుత్వ గుర్తింపు పత్రాలను ఉపయోగించి, మహమ్మద్ అలీ ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో షేక్ మన్సూర్ అనే నకిలీ పేరుతో నివసిస్తున్నాడని ఆ ఏజెన్సీ పేర్కొంది. షేక్ అమానుల్లా, మహమ్మద్ అలీని తీవ్రవాదిగా మార్చి, నియమించుకుని, బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చాడని ఎన్ఐఏ ఛార్జిషీట్‌లో తెలిపింది. 

 “రాయచోటిలోని ఒక రహస్య స్థావరానికి పేలుడు పదార్థాలను తరలించడంలో మహమ్మద్ అలీ, అమానుల్లాకు సహాయం చేశాడు,” అని ఆ ఏజెన్సీ తెలిపింది. భారతదేశంలో షరియా చట్టాన్ని స్థాపించాలనే తమ అజెండాను ముందుకు తీసుకెళ్లడానికి, భయోత్పాతం సృష్టించేందుకు ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన నాయకులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడానికి ఈ ఇద్దరూ కుట్ర పన్నారని కూడా అది పేర్కొంది.

బాంబు పేలుళ్లకు పాల్పడి ప్రజల్లో భయాందోళనలు సృష్టించటం ద్వారా భారత్‌లో ‘షరియా’ చట్టం అమలు చేయడమే వీరి ఎజెండా అని ఎన్​ఐఏ తెలిపింది. రాయచోటి నుంచి ఎవరికీ వారి మీద అనుమానం రాకుండా రహస్యంగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించేవారు.భారీ పేలుళ్లకు కుట్రలు పన్నారు. ఈ కేసులో ప్రధాన కుట్రదారుడైన అమానుల్లా మహమ్మద్‌ అలీకి ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోసి, అతణ్ని తమ ముఠాలో నియమించుకున్నారని పేర్కొంది. 

అంతేకాకుండా, అలీకి బాంబుల తయారీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చాడని చెప్పింది. అమానుల్లా తయారు చేసిన అత్యంత ప్రమాదకర పేలుడు పదార్థాలను ఎవరికీ అనుమానం రాకుండా రాయచోటిలోని రహస్య ప్రాంతానికి తరలించటంలో మహమ్మద్‌ అలీదే కీలక పాత్ర పోషించారని స్పష్టం చేసింది.  అమనుల్లా పాత్రపై ఫిబ్రవరిలోనే ఛార్జిషీట్‌ వేసింది. తాజా అభియోగపత్రం ప్రకారం 1999లో తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్ల కేసుల్లో మహమ్మద్​ అలీ, షేక్ అమనుల్లాలు నిందితులుగా ఉన్నారు. వీరు దర్యాప్తు నుంచి తప్పించుకోవటానికి అన్నమయ్య జిల్లా రాయచోటికి వచ్చేశారు. 

మహమ్మద్ అలీ తన పేరును షేక్​ మన్సూర్​గా, అమనుల్లా తన పేరును అబూబకర్ సిద్దీఖీగా మార్చుకున్నారు. ఆ మారుపేర్లతో గుర్తింపు పత్రాలూ పొందారు. స్థానికంగా ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వారు అందరితో కలిసిమెలిసి ఉంటూ దుస్తుల వ్యాపారం నిర్వహించేవారు. ఈ నేపథ్యంలో రాయచోటిలోని ఓ రహస్య స్థావరంలో పేలుడు పదార్థాలు నిల్వ చేశారు. 

దీన్ని ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం (సీఐ సెల్) అధికారులు గుర్తించారు. గత ఏడాది జులైలో వీరిని పట్టుకున్నారు. స్థానిక పోలీస్​స్టేషన్​లో వీరిపై కేసు నమోదైంది. తర్వాత దర్యాప్తు ఎన్ఐఏ చేతుల్లోకి వెళ్లడంతో సమగ్ర దర్యాప్తు చేపట్టింది.