జూన్ 25 నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్ పక్రియ ప్రారంభం 

జూన్ 25 నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్ పక్రియ ప్రారంభం 
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ఎన్నికల సంఘం నడుం బిగించింది. దాదాపు పావు శతాబ్దం (25 సంవత్సరాల) తర్వాత రాష్ట్రంలో మొదటిసారిగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) – 2026’ బృహత్తర కార్యక్రమానికి జూన్ 25 నుంచి అంకురార్పణ జరగనుంది. ఈ సుదీర్ఘ ప్రక్రియకు సంబంధించిన ముందస్తు సన్నద్ధతపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సిఈఓ) సి. సుదర్శన్ రెడ్డి ఉన్నతాధికారులతో ఒక కీలకమైన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
 
జీహెచ్ఎంసీ కమిషనర్‌తో పాటు వివిధ జిల్లాల ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అదనపు సీఈఓ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డిలతో సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం (ఈసిఐ) నిర్దేశించిన నిబంధనలకు లోబడి, ఈ ఓటర్ల సర్వే ప్రక్రియను ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. 

క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ అధికారులు (బిఎల్ఓలు), రాజకీయ పార్టీల ఏజెంట్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, ఈ స్పెషల్ డ్రైవ్‌పై ప్రజల్లో విస్తృతమైన చైతన్యం తీసుకురావాలని స్పష్టం చేశారు ఈ ప్రత్యేక ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా జూన్ 25 నుంచి జూలై 24 వరకు నెల రోజుల పాటు బీఎల్ఓలు నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరిస్తారు..

  • జాబితాలో పేరుండి మరణించిన వారు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలను తొలగిస్తారు.
  • ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉంటే (డూప్లికేట్/నకిలీ ఓట్లు) వాటిని గుర్తించి ప్రక్షాళన చేస్తారు.
  • అర్హత ఉండి ఇప్పటివరకు ఓటు హక్కు లేని ప్రతి ఒక్కరికీ కొత్తగా ఓటు కల్పిస్తారు.
  • ఈ భారీ సర్వే కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,000 మందికి పైగా బీఎల్ఓలు, దాదాపు 26,000 మంది బూత్ లెవల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగనున్నారు.

ఈ ప్రత్యేక ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియకు 2026 అక్టోబర్ 1వ తేదీని అర్హత తేదీగా (కట్ ఆఫ్ డేట్) ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఈ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువతీయువకులు కూడా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 3.39 కోట్ల మంది ఓటర్ల డేటాను ఈ సర్వేలో భాగంగా అధికారులు సమగ్రంగా రీ-వెరిఫై చేయనున్నారు. ఈ అరుదైన అవకాశాన్ని తెలంగాణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని, తమ ఓటు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు.