గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ అనుమతి

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ అనుమతి

బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ అనుమతిని మంజూరు చేసింది. 83 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూముల్లో మూసీ ప్రాజెక్టుకు అనుమతిచ్చింది. గోల్కొండ ఆర్టిలరీ పరిధిలోని రూ.533 కోట్ల విలువైన భూముల బదలాయింపునకు ఓకే చెప్పింది. అయితే మరోచోట రూ.533 కోట్ల విలువైన భూములు ఇవ్వాలని ప్రభుత్వానికి షరతు విధించింది. 

ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, భారత ఆర్మీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూముల బదలాయింపు కీలక మైలురాయి అని అభివర్ణించారు. మూసీ, ఈసీ నదుల సంగమ స్థలిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనుంది. 

గాంధీ సరోవర్‌ ప్రాజెక్టుకు అక్కడున్న రక్షణ భూములు ఇవ్వాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొద్దిరోజుల క్రితం విజ్ఞప్తి చేశారు. మూసీ, ఈసీ నదుల సంగమ స్థలిలో గాంధీ సర్కిల్‌ ఆఫ్‌ యూనిటీ నిర్మాణం చేపడుతున్నామని ఆయనకు వివరించారు. అందుకోసం అక్కడున్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కొద్దిరోజుల క్రితం కోరారు.

జాతీయ సమైక్యత, గాంధీ విలువలకు సంకేతంగా చేపడుతున్న గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పరంగా చేయూతనందించాలని విజ్ఞప్తి చేశారు. గాంధీ సరోవర్‌ ప్రాజెక్టులో మహాత్ముడి సిద్ధాంతాలను ప్రచారం చేసే విజ్ఞాన కేంద్రం, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ఘాట్లు, శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మించనున్నారు. 

ఇందుకు రక్షణ శాఖ భూములు కూడా అవసరమైనందు వల్ల కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. తాజాగా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ అనుమతి మంజూరు చేయడంతో పనులు ముందుకు సాగనున్నాయ. మరోవైపు ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు.