తమిళనాడు బాణసంచా పరిశ్రమలో పేలుడు.. 23 మంది మృతి

తమిళనాడు బాణసంచా పరిశ్రమలో పేలుడు.. 23 మంది మృతి

తమిళనాడులోని విరుద్ నగర్ సమీపంలోని కట్టనార్‌పట్టిలో ఉన్న ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో ఆదివారం మధ్యాహ్న సమయంలో ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరగడంతో 23 మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. బాణాసంచా పేలుడు ధాటికి కలిగిన ప్రకంపనలు 10 కి.మీ దారం వరకు విస్తరించాయని స్థానికులు చెబుతున్నారు.  అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతం సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ధాటికి బాణసంచా తయారీ పరిశ్రమ పూర్తిగా ధ్వంసమైంది.

పేలుడు తీవ్రతకు పరిసరాలు కంపించిపోయాయి. సమీప ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 30 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ విషాధ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆరా తీశారు.  సహాయక చర్యలను వేగవంతం చేయడానికి, బాధిత కుటుంబాలను ఓదార్చడానికి మంత్రులు కేకేఎస్‌ఎస్ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసులను వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు.

మరోవైపు ఈ పేలుడు ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో భారీ ప్రాణనష్టం సంభవించడం తమను ఎంతో కలచివేసిందని తెలిపారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తమిళనాడు విరుదునగర్ జిల్లా కాటునార్‌పట్టిలో ముత్తుమాణికంకు చెందిన ‘వనజ ఫైర్‌క్రాకర్’ ఫ్యాక్టరీ ఉంది. దీనికి ప్రభుత్వ అనుమతి ఉంది. ఈ కర్మాగారంలోని 10కి పైగా గదులు ఉన్నాయి. వాటిలో సుమారు 30 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. ఈ రోజు సెలవు దినం అయినప్పటికీ, ఫ్యాక్టరీ ముందు భాగంలోని వరాండాలో బాణసంచా తయారీ, ముడి పదార్థాల నిర్వహణ పనులు చేపట్టారు. 

ఈ క్రమంలోనే ముడి పదార్థాలు ఒకదానికొకటి రాపిడికి గురై ఒక్కసారిగా మంటలు అంటుకున్నట్లు ప్రాథమిక సమాచారం. దీనితో క్షణాల వ్యవధిలోనే మంటలు ఫ్యాక్టరీ అంతటా వేగంగా వ్యాపించి భారీ పేలుడు సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటనలో అక్కడికక్కడే 22 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలతో విరుదునగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

కొన్ని రోజుల క్రితమే విరుదునగర్ సమీపంలోని వెంబకోట్టై ప్రాంతంలో జరిగిన బాణసంచా ఫ్యాక్టరీ ప్రమాదంలో నలుగురు మరణించారు. మళ్లీ అదే జిల్లాలో ఇంత భారీ స్థాయిలో ప్రాణనష్టం జరగడం స్థానిక ప్రజల్లో తీవ్ర దిగ్భ్రాంతిని, భయాందోళనలను కలిగిస్తోంది.