కాల్పుల విరమణలో తెరవెనుక చైనా కీలక పాత్ర

కాల్పుల విరమణలో తెరవెనుక చైనా కీలక పాత్ర
పశ్చిమ ఆసియాలో 38 రోజులుగా కొనసాగుతున్న రక్తసిక్తమైన ఘర్షణకు విరామం ఇచ్చేందుకు, అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు ఇరాన్‌ను చర్చల బల్ల వద్దకు తీసుకువచ్చింది చైనాయేనని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. కాల్పుల విరమణ కుదర్చడంలో చైనా ప్రమేయం ఉందా? అని అడిగినప్పుడు, “అవుననే విన్నాను” అని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో అంతర్జాతీయ వ్యవహారాలలో క్రియాశీల పాత్రకోసం ఆ దేశం ఆకాంక్షలు  మరోసారి వెల్లడైంది.

అమెరికా ఆంక్షలను లెక్క చేయకుండా ఇరాన్ ముడి చమురు, సహజ వాయువుల్లో సింహభాగాన్ని గత కొన్నేళ్లుగా చైనాయే కొంటోంది. అందుకే ఇరాన్‌తో తాము జరుపుతున్న చర్చలకు సహకారాన్ని అందించాలని చైనాను పాక్ కోరింది. దీనికి ఈ నెల ఆరంభంలోనే చైనా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధిని తెరిచేలా ఇరాన్‌ను ఒప్పించడానికి తెర వెనుక చైనా చాలానే ప్రయత్నాలు చేసిందని సమాచారం. 

వీటి ఫలితంగా ట్రంప్ విధించిన డెడ్‌లైన్ (ఏప్రిల్ 7న రాత్రి 8 గంటల)కు కొన్ని గంటల ముందే, అమెరికా -ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీనికి ‘ఇస్లామాబాద్ అకార్డ్స్’ అనే పేరును పెట్టారు. ఏప్రిల్ 7న ఉదయం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, గల్ఫ్ దేశాలతో 26 సార్లు ఫోన్ కాల్‌లో సంభాషించినట్లు చైనా ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. పశ్చిమాసియాలోని చైనా ప్రత్యేక రాయబారి కూడా ఈ చర్చల్లో కీలక పాత్రను పోషించారని చెప్పారు. 

పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులలో చైనా పాత్ర, కార్యకలాపాల గురించి చాలా వార్తలు వచ్చినప్పటికీ, ఆ దేశ నాయకత్వం దీనిపై బహిరంగంగా ఎలాంటి స్పందనలు గానీ, ప్రమేయం గానీ వెల్లడించలేదు. అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం, ఇరాన్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన బీజింగ్, అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని ఆపడంలో, ఇరు పక్షాలను చర్చలకు ఒకచోట చేర్చడంలో తెరవెనుక రహస్య పాత్ర పోషించింది. 
 
చర్చలు ఏర్పాటు చేసేందుకు టర్కీ, ఈజిప్ట్, పాకిస్తాన్ వంటి మధ్యవర్తి పక్షాలతో కలిసి పనిచేయడం ద్వారా చైనా, ఇరాన్‌ను శాంతి మార్గం వైపు నడిపించింది. మే మధ్యలో షీ జిన్‌పింగ్‌తో చర్చల కోసం డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లేలోపు, ఈ ఘర్షణ తీవ్రత తగ్గాలని చూడటంలో బీజింగ్‌కు స్పష్టమైన ప్రయోజనం ఉంది.  వాస్తవానికి మార్చి చివరిలో జరగాల్సిన తన పర్యటనను, కొనసాగుతున్న యుద్ధ అవసరాలను కారణంగా చూపుతూ ట్రంప్ ఇంతకుముందు వాయిదా వేశారు.
అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం, చర్చలు పురోగమిస్తున్న కొద్దీ చైనా అధికారులు తమ ఇరాన్ ప్రతిరూపాలతో సంప్రదింపులు కొనసాగించారు.  చైనా తన పాత్రను బహిరంగంగా ధృవీకరించనప్పటికీ, ఇరాన్‌లోని పరిణామాలను ప్రభావితం చేయడానికి బీజింగ్ పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ వంటి మధ్యవర్తుల ద్వారా పనిచేస్తోందని అధికారులు సూచించారు. ఈ ఘర్షణలో తమ ప్రమేయంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన జారీ చేయనప్పటికీ, ఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి బీజింగ్ “శాంతి కోసం అవిశ్రాంతంగా” పనిచేస్తోందని వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఇంతకుముందు తెలిపింది.

నిశితంగా పరిశీలిస్తే, చైనా ఏది చేసినా దాని ప్రయోజనాల కోసమే చేస్తుంది. చైనా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇరాన్ యుద్ధం టైంలోనూ షాడో ఫ్లీట్‌ల (బీమా లేని పాత నౌకల) ద్వారా లక్షలాది బ్యారెళ్ల ఇరాన్ చమురును కొనుగోలు చేసింది. తద్వారా చమురు సంక్షోభం నుంచి గట్టెక్కింది. 

ఒకవేళ అమెరికా- ఇరాన్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగితే, చైనాకు ఇరాన్ చమురు ఎగుమతుల సప్లై పూర్తిగా ఆగిపోయేది. ఒకవేళ హర్మూజ్ జలసంధిని అమెరికా ఆధీనంలోకి తీసుకొని ఉంటే, చైనా షాడో ఫ్లీట్‌లను అడ్డుకొని ఉండేది. నికోలస్ మదురోను అమెరికా కిడ్నాప్ చేసినప్పటి నుంచి వెనెజువెలా చమురును పొందే అవకాశాన్ని చైనా కోల్పోయింది.

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపు దాలిస్తే చైనా ఇంధన భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వస్తువులను విక్రయించే చైనా సామర్థ్యం తగ్గిపోతుంది. ఇరాన్‌తో సంప్రదింపుల మార్గాలను పాకిస్థాన్ సజీవంగా ఉంచగలిగినప్పటికీ, ఆర్థిక ప్రయోజనాలు, ఇంధన భద్రతా ఆందోళనలతో చైనా జోక్యం చేసుకున్నందు వల్లే ఒప్పందం కుదిరింది.