* ఎగ్జిట్ పోల్స్పై ఎన్నికల కమిషన్ నిషేధం
కేరళంలో ఇండియా కూటమి, ఎల్డిఎఫ్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నాయి. అభివృద్ధి, అవినీతి అంశాలే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సందించుకున్నాయి. ఈ ఎన్నికల్లో కేరళలోని 140 స్థానాలకు 883 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రధాన పార్టీల ప్రచారం జోరుగా సాగింది. పుదుచ్చేరిలోని 30 స్థానాలకు 294 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధానంగా ఎన్డీఏ- ఇండియా కూటమికి మధ్య పోటీ నెలకొంది.
ప్రచారం ముగియడంతో ఎన్నికల సంఘం ఇప్పుడు పోలింగ్ నిర్వహణపై దృష్టి సారించింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మూడు ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలను కల్పించారు. ప్రచారం ముగిసిన తర్వాత ‘నిశ్శబ్ద కాలం’ అమలులో ఉన్నందున, అభ్యర్థులు బయట ప్రచారం చేయడానికి వీలుండదు.
ఈ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది. కేరళలో సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ పినరయి విజయన్ ప్రభుత్వం మళ్లీ వస్తుందా? లేదా అస్సాంలో బీజేపీ పట్టు నిలుపుకుంటుందా? అనే అంశాలపై విశ్లేషణలు మొదలయ్యాయి. పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ప్రజల నాడిని ప్రతిబింబించనున్నాయి. అప్పటి వరకు అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉండనుంది.
కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్పై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 7.00 గంటల నుండి ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం 6.30గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ సర్వే నిర్వహించడం, వాటి ఫలితాలను వెల్లడించకూడదని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ నిర్దిష్ట సమయంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం లేదా వెల్లడించడం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126ఎను ఉల్లంఘించడమేనని హెచ్చరించింది. ఉల్లంఘించిన వారికి రెండేళ్ల కఠిన కారాగారశిక్ష లేదా జరిమానా , లేదా రెండూ అమలు చేయవచ్చని స్పష్టం చేసింది.

More Stories
ఇరాన్పై 2 వారాల పాటు దాడుల నిలిపివేత
జీవితంలోనే అత్యుత్తమ ‘సినిమాటిక్ అనుభవం’ ‘ధురందర్ 2’
శబరిమలలో మహిళల ప్రవేశంపై ఆంక్షలు సమర్ధించిన కేంద్రం