తండ్రి కొడుకుల లాకప్ డెత్ లో 9 మంది పోలీసుల‌కు మ‌ర‌ణ‌శిక్ష‌

తండ్రి కొడుకుల  లాకప్ డెత్ లో 9 మంది పోలీసుల‌కు మ‌ర‌ణ‌శిక్ష‌
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2020 నాటి సత్తాంకుళం తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో మధురైలోని ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు దోషులుగా తేల్చి 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది.   అత్యంత క్రూరత్వం, అధికార దుర్వినియోగంతో కూడిన `అరుదైన వాటిలోకెల్లా అరుదైన నేరం’గా ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిందితుల్లో శ్రీధ‌ర్‌, ర‌ఘుగ‌ణేశ్‌, మురుగ‌న్‌, బాల‌కృష్ణ‌న్‌, ముత్తురాజ్‌, చెల్లాదురై, థోమ‌న్ ఫ్రాన్సిస్‌, స‌ముదురై, వేయిల్‌ముత్తు ఉన్నారు. 
 
శ్రీధ‌ర్‌కు రూ. 15 ల‌క్ష‌ల జరిమానా కూడా విధించారు. తండ్రి జ‌య్‌రాజ్‌, కుమారుడు బెన్నిక్స్ ఓ మొబైల్ షాపు న‌డుపుతున్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో గ‌డువు ముగిసిన త‌ర్వాత కూడా షాపును ఓపెన్ చేసిన కేసులో జూన్ 19, 2020న వాళ్ల‌ను అరెస్టు చేశారు. రాత్రంతా తండ్రీకొడుకుల్ని పోలీసులు తీవ్రంగా చిత్ర‌హింస పెట్టారు. ఆ త‌ర్వాత కోవిల్‌ప‌ట్టి స‌బ్‌జైల్‌కు పంపారు.
అయితే అంతకు ముందు పోలీసులు తీవ్రంగా కొట్టడంతో తండ్రీకొడుకులు జూన్ 23న కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మరణించారు. పోలీసు కస్టడీలో ఈ మరణాలు సంభవించడంతో సత్తాంకుళం ప్రాంతంలో తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీశాయి. వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. 
ఈ కేసుపై సుమోటోగా విచారణ చేపట్టిన మద్రాస్‌ హైకోర్టు దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది.
ఆనాటి సత్తాంకుళం ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్-ఇన్స్పెక్టర్లు బాలకృష్ణన్, రఘు గణేశ్లతో సహా మొత్తం 10 మంది పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణ సమయంలో ఒక పోలీసు అధికారి కరోనా కారణంగా మృతిచెందారు.  బాధితులు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించలేదని, వారిపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని సీబీఐ దర్యాప్తులో తేలింది. బాధితుల గాయాల నుంచి కారుతున్న రక్తాన్ని వారితోనే తుడిపించినట్లు విచారణలో వెల్లడైంది.
2020 సెప్టెంబరులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2022లో అదనపు ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.  సాతంకులం పోలీస్ స్టేష‌న్‌లో బాధితుల‌ను చిత్ర‌హింస పెట్టిన‌ట్లు సీబీఐ దాఖ‌లు చేసిన కేసును కోర్టు ఆమోదించింది. క‌ర్ర‌లు, ఇనుప రాడ్లతో కొట్ట‌డం వ‌ల్ల ఆ ఇద్ద‌రూ మ‌ర‌ణించిన‌ట్లు పోస్టుమార్ట‌మ్‌లో తేలింది. నిందిత పోలీసులు కేసులో త‌ప్పుడు రికార్డులు సృష్టించే ప్ర‌య‌త్నం చేశార‌ని, ద‌ర్యాప్తును అడ్డుకునేందుకు చూశార‌ని ప్ర‌త్యేక కోర్టు చెప్పింది.