* యుద్ధం ముదిరితే, ఈ ప్రాంతం “నరకం”గా మారుతుందని ఇరాన్ హెచ్చరిక
అమెరికా, ఇరాన్లు ఒకరిపై ఒకరు తీవ్రమైన బెదిరింపులు చేసుకుంటున్నాయి. యుద్ధం ముదిరితే, ఈ ప్రాంతం అమెరికా, ఇజ్రాయెల్లకు “నరకం”గా మారుతుందని ఇరాన్ హెచ్చరించింది. ఒకవేళ ఇరాన్ ఒప్పందం చేసుకోకపోయినా లేదా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవకపోయినా, ఆ దేశంపై “సర్వనాశనం” చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఒకవేళ అమెరికా తన బెదిరింపులను అమలు చేస్తే, ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ ప్లాంట్లతో సహా అమెరికా, ఇజ్రాయెల్ ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ సైనిక అధికారులు శపథం చేస్తున్నారు. ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఇరాన్కు అల్టిమేటం ఇచ్చారు. సమయం మించిపోతోందని, “48 గంటల్లో వారిపై సర్వనాశనం జరుగుతుంది” అని ఆయన హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, శుక్రవారం ఒక అమెరికా యుద్ధ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ కొత్త వాయు రక్షణ వ్యవస్థను ఉపయోగించిందని, ఇరాన్ ఖతమ్ అల్-అన్బియా సంయుక్త సైనిక కమాండ్ శనివారం తెలిపినట్లు రాయిటర్స్ నివేదించింది. మరోవైపు, ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ మత్స్యకారుల బృందం శనివారం అర్మేనియా మీదుగా స్వదేశానికి తిరిగి వస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇరాన్ ఇంటర్నేషనల్, ఐఆర్జిసి అనుబంధ తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ నివేదికను ఉటంకిస్తూ, శనివారం హోర్ముజ్ జలసంధి గుండా నిత్యావసర మరియు మానవతా సహాయ వస్తువులతో కూడిన నౌకల ప్రయాణానికి ఇరాన్ అనుమతించిందని నివేదించింది. ఇదిలా ఉండగా, ఉదయం బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం ప్రాంగణానికి సమీపంలో ఒక క్షిపణి పడిందని టెహ్రాన్ తెలిపింది.
ఆ తర్వాత, ఈ దాడి గురించి ఇరాన్ తమకు తెలియజేసిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) ధృవీకరించింది. అణు ప్రమాదం జరిగే ప్రమాదాన్ని నివారించడానికి గరిష్ట సైనిక సంయమనం పాటించాలని కూడా ఐఏఈఏ పిలుపునిచ్చింది.
అల్టిమేటం గుర్తు చేసిన ట్రంప్
అమెరికాతో ఇరాన్ ఒప్పందం చేసుకోవటానికి, హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు తాము ఏప్రిల్ 6 వరకు ఇచ్చిన 10 రోజుల గడువు మరో 48 గంటల్లో పూర్తవుతోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గుర్తు చేశారు ఇరాన్ దారికి రాకపోతే మరో 48 గంటల తరువాత బీభత్సం తప్పదని హెచ్చరిస్తూ ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్టు పెట్టారు.
సమయం మించిపోతోందని, 48 గంటల తర్వాత విధ్వంసమేనని స్పష్టం చేశారు ఆపైన అంతా భగవంతుడి దయ అంటూ డొనాల్డ్ ట్రంప్.. ట్రూత్ సోషల్లో చేసిన పోస్టు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. “ఒప్పందం కుదుర్చుకోవడానికి లేదా హర్మూజ్ జలసంధిని తెరవడానికి నేను ఇరాన్ కు పది రోజుల గడువు ఇచ్చిన విషయం గుర్తుందా? సమయం మించిపోతోంది. వారిపై ప్రళయం విరుచుకుపడటానికి ఇంకా 48 గంటలే మిగిలి ఉన్నాయి. ఆపై అంతా భగవంతుడి దయ” అంటూ ట్రంప్ ట్రూత్లో పోస్ట్ చేశారు.
అయితే ట్రంప్ ఒప్పందం ప్రతిపాదనలను ఇరాన్ ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తోంది. ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాన్ని విరమించే ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్ ఇరాన్కు 15 అంశాలతో ప్రతిపాదన పంపించారు. అయితే ఈ అంశాలపై అమెరికాతో చర్చలకు ఇరాన్ అంగీకరించటం లేదు. ఇరాన్ అమెరికా ప్రతిపాదనలను అవాస్తవాలు, అతిశయాలుగా పేర్కొంటూ వాటిని తిరస్కరిస్తూ వస్తోంది.
ఈ నేపథ్యంలో ఓవైపు దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తూనే, మరోవైపు అమెరికా అదనపు బలగాలను మోహరిస్తోంది. పశ్చిమాసియాకు ట్రంప్ దాదాపు 50 వేల మంది అమెరికన్ సైనిక సిబ్బందిని తరలించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. మరోవంక, యుద్ధం ముగింపు దిశగా పాక్లో చర్చలకు తాము హాజరుకాబోమని ఎప్పుడూ చెప్పలేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ తాజాగా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. పాక్ మధ్యవర్తిత్వంపై కృతజ్ఞతతో ఉన్నామని కూడా పేర్కొన్నారు. ఇరాన్పై అక్రమ దాడుల ముగింపునకే తమ ప్రాధాన్యమని కూడా చెప్పుకొచ్చారు. గల్ఫ్లో యుద్ధం ముగింపు కోసం పాక్ వేదికగా జరుగుతున్న చర్చల్లో పురోగతి కొరవడిందన్న వార్తల నడుమ ఇరాన్ మంత్రి ఈ వాఖ్యలు చేశారు.

More Stories
జనాభా లెక్కల్లో తెలిసిన భాషగా `సంస్కృతం’ చేర్చండి
ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతతో ప్రాణహాని.. రక్షణ కల్పించండి
రేపే బీజేపీ ఆవిర్భావ దినోత్సవం .. ఇంటింటిపై పార్టీ జెండా