‘బాధితురాలి కార్డు’ను వాడుతున్న మమతా 

‘బాధితురాలి కార్డు’ను వాడుతున్న మమతా 
బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రాజకీయాల్లో ‘బాధితురాలి కార్డు’ను వాడుతున్నారని  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా  ఆరోపించారు. ‘మమతా బెనర్జీ ఎప్పుడూ బాధితురాలి పాత్ర పోషిస్తూ వచ్చారు. కొన్నిసార్లు ఆమె కాలు విరగ్గొట్టుకుంటారు. మరికొన్నిసార్లు తలకు కట్టు కట్టుకుంటారు. కొన్నిసార్లు అనారోగ్యానికి గురవుతారు. ఆపై మళ్లీ ఎన్నికల సంఘం ముందు నిలబడి, ఆ సంస్థను దూషిస్తూ నిస్సహాయతను నటిస్తారు’ అంటూ విమర్శించారు. 
 
బంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి, బీజేపీ రాష్ట్ర అధ్యకుడు సమీక్ భట్టాచార్యలతో కలిసి, అమిత్​ షా కోల్​కతాలో టీఎంపీ ప్రభుత్వంపై శనివారం ఛార్జిషీటు విడుదల చేస్తూ రానున్న ఎన్నికల్లో బంగాల్ ప్రజలు భయం, విశ్వాసాల్లో ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. టీఎంసీ అధికారంలోకి రావడానికి అబద్ధాలు, భయం, హింస మూలాధారాలుగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.  దానికి వ్యతిరేకంగా బీజేపీ 2011 నుంచి పోరాడుతోందని తెలిపారు.
బెంగాల్​ నుంచి టీఎంసీని తొలగించాలని ప్రజలను ఆయన కోరారు. ఈసారి రాష్ట్రంలో బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.  కానీ బాధితుల కార్డు రాజకీయాలను బెంగాల్‌ ప్రజలు ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నారని ఆమెకు చెప్పడానికే తాను వచ్చినట్లు ఆయన తెలిపారు.   దేశంలో మరెక్కడా కనిపించని విధంగా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) సమయంలో కేవలం బెంగాల్‌లో మాత్రమే న్యాయాధికారులను నియమించారని పేర్కొంటూ.దీనికి కారణం ఏమిటి? మమతా బెనర్జీ దీనికి బెంగాల్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు.
 
“మమత ఎస్‌ఐఆర్‌పై ఆరోపణలు చేశారు. అయితే ఈరోజు నేను బెంగాల్‌ ప్రజలను అడగాలనుకుంటున్నాను. ఇక్కడ ఉంచిన ఆ చొరబాటుదారులను బెంగాల్‌ భవిష్యత్తును నిర్ణయించడానికి అనుమతించాలా? చొరబాటుదారులను కేవలం ఓటర్ల జాబితా నుంచే కాకుండా దేశం నుంచి బహిష్కరించడానికి మేము నిశ్చయించుకున్నాము. మా పార్టీ అజెండా అదే” అని అమిత్‌ షా స్పష్టం చేశారు.

మే 6వ తేదీన బెంగాల్లో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. అధికారంలోకి రాగానే 45 రోజుల్లోగా సరిహద్దు కంచెకు అవసరమైన భూమిని బెంగాల్‌ బిజెపి ప్రభుత్వం భారత ప్రభుత్వానికి అందించి చొరబాటుదార్లను అరికడుతుందని తేల్చి చెప్పారు. 77 వర్గాలను దీదీ ప్రభుత్వం ఓబిసి కేటగిరీలో చేర్చిందని గుర్తు చేస్తూ ఈ 77లో 75 ముస్లిం వర్గాలే ఉన్నాయని ధ్వజమెత్తారు.
 
ఓబిసిలను మతం ఆధారంగా నిర్ణయిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది ఎక్కువ కాలం కొనసాగదని స్పష్టం చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చాక, నియామక కుంభకోణాల కారణంగా వయోపరిమితి ముగిసిపోయిన యువతకు ఐదేళ్ల వయో సడలింపు కల్పిస్తుందని తెలిపారు. పారదర్శక నియామక ప్రక్రియను నిర్ధారించడంతోపాటు ఎస్‌ఎస్‌సి నియామకాలలో వారికి కూడా అవకాశం కల్పిస్తామఅని అమిత్‌ షా హామీ ఇచ్చారు.