వారణాసిలో గంగా నదిపై ఇఫ్తార్ విందు.. 14 మంది అరెస్ట్‌

వారణాసిలో గంగా నదిపై ఇఫ్తార్ విందు.. 14 మంది అరెస్ట్‌

యూపీ, వారణాసిలోని పవిత్ర గంగానదిలో కొంతమంది యువకులు ఇఫ్తార్ విందు జరుపుకోవడం వివాదంగా మారింది. దీనిపై పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు 14 మందిని అరెస్టు చేశారు. ఇటీవల గంగా నదిపై ఒక బోటులో ఒక వర్గానికి చెందిన యువకులు ఇఫ్తార్ విందు చేసుకున్నారు.  గంగా నదిలో బోటుపై ప్రయాణిస్తూ వివిధ పదార్థాలుసహా చికెన్ బిర్యానీ వంటి నాన్‌ వెజ్ తిన్నారు.

 పైగా మిగిలిన బిర్యానీ, ఎముకలు వంటి పదార్థాల్ని నదిలోనే పడేశారు. అంతేకాదు దీన్నంతటినీ వీడియో తీసుకుని, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  పవిత్రంగా భావించే గంగానదిలో విందు చేసుకోవడం, నాన్‌వెజ్‌ను నదిలో పారేయడం ఏంటని కొందరు హిందూ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రజత్ జైశ్వాల్ అనే వ్యక్తి కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇలా చేయడం వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. విందు చేసుకున్న 14 మందిని గుర్తించి, అరెస్టు చేశారు. మరికొందరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నదిలో బోటుపై విందు చేసుకోవడానికి గల కారణాలపై నిందితుల్ని విచారిస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత రావడంతో, మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు గుర్తు తెలియని వ్యక్తులపై భారతీయ జనతా యువ మోర్చా నగర అధ్యక్షుడు రజత్ జైస్వాల్ కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మాన్ని అనుసరించేవారికి గంగానది విశ్వాసంతో ముడిపడి ఉందని, లక్షలాది మంది భక్తులు ప్రతిరోజూ ఆచమనం (పవిత్ర జలాన్ని సంప్రదాయబద్ధంగా స్వీకరించడం) చేయడానికి వస్తారని జైస్వాల్ తెలిపారు. 
 
ఈ ఆరోపిత చర్యను ఆయన “ఖండించదగినది”గా అభివర్ణించారు. ఫిర్యాదుతో పాటు, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా సాక్ష్యంగా సమర్పించారు. ఈ ఘటనలో పాల్గొన్న పడవ నడిపే వ్యక్తితో సహా ఇతరులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతని లైసెన్సును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు