‘హిందూ-సిక్కు ఏకతా’ పంజాబ్ పురోగతికి పునాది

‘హిందూ-సిక్కు ఏకతా’ పంజాబ్ పురోగతికి పునాది
‘హిందూ-సిక్కు ఏకతా’ (ఐక్యత) పంజాబ్ పురోగతికి పునాది అని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. 2027లో బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఈ సామాజిక ఐక్యతను సాధింపగలదని, అదే సమయంలో మాదకద్రవ్యాల ముప్పును పూర్తిగా కట్టడి చేయగలదని ఆయన భరోసా వ్యక్తం చేశారు.
శనివారం పంజాబ్‌లోని మోగా జిల్లా, కిల్లి చాహ్లాన్ గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో  ప్రసంగిస్తూ, రాష్ట్రంలో ‘మతపరమైన సంక్షోభం’ గురించి ప్రస్తావించిన ఆయన, బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని ప్రవేశపెడుతుందని హామీ ఇచ్చారు. అలాంటి పద్ధతులను వ్యతిరేకించడానికి సిక్కు గురువులు తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు.
భగవంత్ మాన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఆ పార్టీ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఒక ‘ఎటిఎం’లా మారిపోయిందని షా ఆరోపించారు. అప్పులు, డ్రగ్స్, అక్రమ మత మార్పిడులు, అవినీతి, గ్యాంగ్‌స్టర్ల అరాచకాలతో పంజాబ్ నాశనమైందని ధ్వజమెత్తారు. పంజాబ్ ప్రజలు గతంలో కాంగ్రెస్ పార్టీకి, శిరోమణి అకాలీదళ్‌, ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశాలు ఇచ్చారన్నారని షా గుర్తు చేస్తూ 2027 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
‘డబుల్ ఇంజిన్’ పరిపాలన బలంతో కూడిన ఏకీకృత పంజాబ్, రాష్ట్రం కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరించడానికి, దాని సరిహద్దులను భద్రపరచడానికి ఏకైక మార్గం అని షా తెలిపారు. సిక్కు గురువుల గౌరవనీయ వారసత్వాన్ని గుర్తుచేస్తూ, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లలోని సరిహద్దుల్లోని సిక్కు మందిరాలను రక్షించడానికి బీజేపీ నిరంతరం పనిచేస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు.
కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ గురించి ప్రస్తావిస్తూ, పార్టీ దృఢ సంకల్పం వల్లే ఈ యాత్ర సాధ్యమైందని పేర్కొంటూ స్వాతంత్ర్యం సమయంలో బిజెపి అధికారంలో ఉండి ఉంటే, కర్తార్‌పూర్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేదని ఆయన తెలిపారు. అకల్ తఖ్త్‌పై దాడికి కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని, హిందూ, సిక్కు వర్గాల మధ్య ఉద్దేశపూర్వకంగా “అగాధం” సృష్టిస్తోందని ఆరోపిస్తూ, షా  కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ “స్పష్టమైన మౌనం” పాటిస్తున్నదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సునీల్ జఖర్ విమర్శించారు. ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడానికి బదులుగా, కాంగ్రెస్ నాయకులు అంతర్గత ఆధిపత్యాలు, వర్గ విభేదాలతో మునిగిపోతున్నారని ఆయన ఆరోపించారు. 
1980లలో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన ఇలాంటి అధికార పోరాటం పంజాబ్‌ను “రెండు దశాబ్దాల రక్తపాత గందరగోళంలో” నెట్టిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర భద్రత, స్థిరత్వంపై అంతర్గత వివాదాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, కాంగ్రెస్ మరోసారి పంజాబ్ ప్రజలను విఫలం చేస్తోందని ఆయన హెచ్చరించారు.
బిజెపిని ప్రత్యామ్నాయంగా పేర్కొంటూ, బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రమే పంజాబ్ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించగలదని,  రాష్ట్ర భద్రత,  మరియు అభివృద్ధిని నిర్ధారించగలదని జఖర్ నొక్కిచెప్పారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు “డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని” కోరుకుంటున్నారని, కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాలను ప్రస్తావిస్తూ ఆయన నొక్కి చెప్పారు. 
పంజాబ్‌లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పరిపాలన ఆర్థిక విధానాలు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయని ఆయన ఆరోపించారు.
పంజాబ్‌లో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిని పునరుద్ధరించడంలో జోక్యం చేసుకుని సహాయం చేయాలని బిజెపి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అశ్వనీ శర్మ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన వరుస హింసాత్మక సంఘటనలను ప్రస్తావిస్తూ, శర్మ పంజాబ్ ఎదుర్కొంటున్న సవాళ్లను ఒక భయంకరమైన చిత్రాన్ని చిత్రించారు.