గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలను తక్షణం మూసివేయాలి

గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలను తక్షణం మూసివేయాలి
పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ తక్షణమే మూసివేయాలని, లేకుంటే వాటిపై దాడులు చేస్తామని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు. హార్ముజ్ జలసంధిని మూసేస్తామని స్పష్టం చేశారు. సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోజ్తాబా ఖమేనీ తొలిసారి బహిరంగ సందేశాన్ని గురువారం విడుదల చేశారు. 

గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో అమెరికా, హార్ముజ్ జలసంధిపై కఠినమైన వైఖరిని ప్రస్తావించారు. ‘ఈ ప్రాంతంలోని అన్ని అమెరికా స్థావరాలను వెంటనే మూసివేయాలి, లేకపోతే వాటిపై దాడి కొనసాగుతుంది’ అని హెచ్చరించారు. ఇరాన్‌ అమరవీరుల ప్రతీకారం తీర్చుకుంటామని ఈ సందర్భంగా మేనీ ప్రతిజ్ఞ చేశారు.

కాగా, దాడుల్లో గాయపడి ఇప్పటి వరకు బయటకు కనిపించని సుప్రీం లీడర్‌ మోజ్తాబా ఖమేనీ ప్రకటనను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌లో ఒక ప్రెజెంటర్‌ వినిపించారు. హార్ముజ్ జలసంధి మూసివేత కొనసాగించాలని చెబుతూ ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై ముజ్తబా తన వైఖరిని స్పష్టం చేశారు.  పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్లను కలిపే ఈ జల సంధి ద్వారానే ప్రపంచ చమురు రవాణాలో ఎక్కువ శాతం జరుగుతుంది.

కనుక ఈ వ్యూహాత్మక మార్గాన్ని మూసివేయడాన్ని ఒక బలమైన అస్త్రంగా ఇరాన్ ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.  పొరుగు దేశాల పట్ల ఇరాన్‌ విధానం సహకారంగా ఉంటుందని చెప్పడానికి ప్రయత్నించారు. ‘ప్రాంతీయ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలకు ఇరాన్‌ మద్దతు ఇస్తుంది. కానీ అమెరికన్ దళాలకు ఆతిథ్యం ఇవ్వకుండా వారిని హెచ్చరిస్తుంది’ అని పేర్కొన్నారు.

మరోవైపు ఇరానియన్ల రక్తానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తాము వెనుకాడబోమని మోజ్తాబా ఖమేనీ స్పష్టం చేశారు. స్కూల్‌పై క్షిపణి దాడిలో సుమారు 110 మంది పిల్లలతో సహా168 మంది మరణించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.  యుద్ధంలో గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందించడంతో పాటు, నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తామని మొజ్తబా ఖమేనీ తెలిపారు. 

యెమెన్‌, ఇరాక్‌లోని సాయుధ దళాలు ఇరాన్‌కు మద్దతు తెలుపుతున్నాయని చెప్పారు. తమ అమరవీరులు చిందించిన రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని మెుజ్తబా తెలిపారు. యుద్ధంలో పోరాడుతున్న తమ సైనికులను మెుజ్తబా అభినందించారు. నలువైపుల నుంచి శత్రువులు దాడులు చేస్తున్నా, సైనికులు అద్భుతంగా పోరాడుతున్నారని కొనియాడారు.

కాగా ఇజ్రాయెల్‌ దాడుల్లో ఓ కాలు విరిగి మొజ్తబా కోమాలోకి వెళ్లిపోయారని, ఆయన మరణించి ఉంటారని వార్తలు వస్తున్న క్రమంలో ఆయన నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.