దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 2026 ఏప్రిల్ 1 నుంచి 20 శాతం వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ20), కనీసం రిసెర్చ్ ఆక్టేన్ నంబర్ (ఆర్ఓఎన్) 95 కలిగిన ఇంధనాన్ని మాత్రమే విక్రయించాలని కేంద్రం ఆదేశించింది. 2026 ఫిబ్రవరి 17న చమురు మంత్రిత్వశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిర్దేశిత ప్రమాణాల ప్రకారం, 20 శాతం వరకు ఇథనాలు మిశ్రమం, కనీసం రాన్ 95 కలిగిన పెట్రోల్ ను మాత్రమే చమురు సంస్థలు దేశవ్యాప్తంగా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
అయితే ప్రత్యేక పరిస్థితుల్లో, కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకు పరిమిత కాలంపాటు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చే అధికారం కేంద్రానికి ఉంటుందని స్పష్టం చేసింది. ఇథనాల్ ను చెరకు, మొక్కజొన్న, ఇతర ధాన్యాల నుంచి తయారు చేస్తారు. అందుకే దీనిని పునరుత్పాదక ఇంధన వనరు అని చెప్పవచ్చు. పైగా దీనిని దేశీయంగా తయారు చేయవచ్చు. సాధారణ పెట్రోల్ కంటే ఇది తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది.
దేశంలో చమురు దిగుమతులు తగ్గించడంతోపాటు, కాలుష్య ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్ను తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం చెరకు, మొక్కజొన్న, సహా అగ్రికల్చర్ సర్ప్లస్కు డిమాండ్ను పెంచి, రైతులకు ఆర్థికంగా బాగా మేలు చేస్తుంది. 2023-25 నుంచి భారతదేశంలో తయారైన మెజారిటీ వాహనాలు ఈ20 ఇంధనంతో నడిచేలా రూపొందించారు.
కనుక వాటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. అయితే పాత వాహనాల విషయంలో మైలేజీ (3 -7 శాతం) స్వల్పంగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. రబ్బరు, ప్లాస్టిక్ భాగాలు త్వరగా అరిగిపోయే అవకాశం ఉంది. భారత్ 2022 జూన్ నాటికి 10 శాతం ఇథనాల్ బ్లెండింగ్ సాధించాలని లక్ష్యం పెట్టుకుంది. దానిని ఐదు నెలల కంటే ముందే చేరుకుంది.
దీనితో ప్రభుత్వం 20 శాతం బ్లెండింగ్ లక్ష్యాన్ని 2030 నుంచి 2026కు మార్చింది. ప్రస్తుతం దేశంలోని మెజారిటీ పెట్రోల్ బంకుల్లో ఈ20 పెట్రోల్ అందుబాటులో ఉంది. చమురు మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2014-15 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్కు బదులుగా ఇథనాల్ వాడడం వల్ల భారతదేశం రూ.1.40 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసింది.

More Stories
భారత సోలార్ ఉత్పత్తులపై 125% సుంకాలు!
రూ. 3.7 వేల కోట్లు విలువైన అనిల్ అంబానీ నివాసం జప్తు!
బీఎస్ఎస్ఎల్ డైరెక్టర్ విలాసవంత యాత్రపై కేంద్రం కన్నెర్ర