అరుణాచల్ సమీపంలో చైనా ‘న్యూక్లియర్’ ప్లాంట్లు

అరుణాచల్ సమీపంలో చైనా ‘న్యూక్లియర్’ ప్లాంట్లు
అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదంటూ ప్రతీసారి భారత్‌తో వాదనకు దిగే చైనా, ఇప్పుడు ఆ ప్రాంతానికి సమీపంలో అణ్వస్త్ర ప్లాంట్లను విస్తరిస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. సిచువాన్‌ ప్రావిన్సులోని రహస్య స్థావరాల్లో వందలమంది శాస్త్రవేత్తలు, కార్మికులు కలిసి అణు సామ్రాజ్యాన్ని సృష్టించారని శాటిలైట్‌ చిత్రాల ద్వారా వెల్లడైందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. 
 
అక్కడ కొత్త బంకర్లు, ప్రాకారాలు సహా అత్యంత భారీ పేలుడు పదార్థాలను తట్టుకోగల విస్తృతమైన పైపింగ్‌ను ఏర్పాటు చేసినట్లు గుర్తించామని పేర్కొంది.
అరుణాచల్‌ ప్రదేశ్‌కు 800 కిలోమీటర్ల దూరంలో గల సిచువాన్ ప్రావిన్స్‌ పర్వతాల్లోని లోతైన రహస్య స్థావరాల్లో చైనా అణు కేంద్రాలను దూకుడుగా నిర్మిస్తున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపింది. 
రష్యా దగ్గర 5,400 అమెరికా దగ్గర 5,200వరకు అణు వార్‌హెడ్‌లు ఉండగా 3వ స్థానంలో ఉన్న చైనా దగ్గర దాదాపు 600 అణ్వస్త్రాలు ఉన్నట్లు సమాచారం.
2030 నాటికి వెయ్యి కంటే ఎక్కువ వార్‌హెడ్‌లను చేరుకునే మార్గంలో చైనా ఉందని ఇప్పటికే అమెరికా నిఘావర్గాలు గుర్తించాయి.  ఈ నేపథ్యంలో సిచువాన్ ప్రావిన్స్‌లోని జిటాంగ్, పింగ్‌టాంగ్ అనే ప్రదేశాల్లో ఉన్న రహస్య అణు కేంద్రాలను విస్తరించడం, ఆధునీకరించడంపై చైనా పనిచేస్తోందని ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.  వందల మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, కార్మికులు పర్వత ప్రాంతాల్లో లోతైన అణు సామ్రాజ్యాన్ని సృష్టించారని తెలిపింది.
జిటాంగ్‌, పింగ్‌టాంగ్‌ స్థావరాల్లో కొత్తబంకర్లు, ప్రాకారాల్ని నిర్మించినట్లు శాటిలైట్‌ ఫొటోల ద్వారా తెలిసినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపింది. కొత్త కాంప్లెక్స్‌లో అత్యంత భారీ పేలుడు పదార్థాలను నిర్వహించే విస్తృతమైన పైపింగ్ ఉంది. ఈ బంకర్లు అధిక పేలుడు పదార్థాలను పరీక్షించడానికి ఉపయోగిస్తారని తెలుస్తోంది. పది బాస్కెట్‌ బాల్ కోర్టుల పరిమాణంలో ఓవల్ టెస్టింగ్ ఏరియా కూడా ఉందని సమాచారం. పింగ్‌టాంగ్ వ్యాలీలో ప్లూటోనియం వార్‌హెడ్ కోర్‌లను చైనా ఉత్పత్తి చేస్తోందని ప్రచారం ఉంది.
ఇక్కడి ప్రధాన నిర్మాణానికి 360అడుగుల ఎత్తైన వెంటిలేషన్ స్టాక్ ఉందనీ తాజాగా ఇక్కడ కొత్త వెంట్లు, హీట్ డిస్పర్సర్‌లను ఏర్పాటు చేశారని శాటిలైట్‌ చిత్రాలు ద్వారా తెలుస్తోంది. పింగ్‌టాంగ్ నిర్మాణం అమెరికా లాస్ అలామోస్ నేషనల్ లాబొరేటరీ వంటి ప్లూటోనియం వార్‌హెడ్ కోర్‌ల ఉత్పత్తి కేంద్రాలను పోలి ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో యూఎస్, సోవియట్ యూనియన్‌ దాడుల నుంచి అణు ఉత్పత్తిని కాపాడుకునేందుకు ఐదు దశాబ్దాల క్రితం మావో జెడాంగ్ హయాంలో చాలా స్థావరాలను నిర్మించారు. తర్వాత చాలా వాటిని చైనా ప్రభుత్వం మూసేసింది.  అయితే 2019 నుంచి మళ్లీ అణ్వాయుధాలపై డ్రాగన్‌ దృష్టిని సారించిందని, తర్వాత పరిణామాలు వేగంగా మారినట్లు శాటిలైట్‌ ఫొటోలను పరిశీలించిన జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ నిపుణుడు బాబియార్జ్ తెలిపారు.
అటు రాకెట్ ఫోర్స్ నాయకత్వాన్ని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే ప్రక్షాళన చేసింది.  మరోవైపు అమెరికా మెరైన్ కోర్‌ మాదిరిగా సైనిక దళాన్ని సిద్ధం చేసింది చైనా. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ మెరైన్ కోర్‌ పేరుతో 30,000 మంది సైనికులను సిద్ధం చేసినట్లు బీజింగ్‌ తెలిపింది.