కాలిఫోర్నియాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి సాకేత్ మృతి

కాలిఫోర్నియాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి సాకేత్ మృతి
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఆరు రోజుల క్రితం అదృశ్యమైన భారతీయ విద్యార్థి 22 ఏళ్ల సాకేత్ శ్రీనివాసయ్య చివరకు శవమై తేలాడు. కర్ణాటకకు చెందిన ఈయన మృతదేహం తాజాగా కాలిఫోర్నియాలో లభ్యం కావడంతో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.
కాలిఫోర్నియాలోని బర్కలే విశ్వవిద్యాలయంలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ విభాగంలో ఎంఎస్ చదువుతున్న సాకేత్ ఫిబ్రవరి 9వ తేదీన చివరి సారిగా కనిపించాడు. యూనివర్సిటీ క్యాంపస్‌కు సుమారు ఒక కిలోమీటరు దూరంలో గత సోమవారం చూసినట్లు ప్రత్యక్ష సాక్షలు వెల్లడించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
ఎఫ్‌బీఐ అధికారులు కూడా రంగంలోకి దిగి ముమ్మరంగా గాలించారు. ఈక్రమంలోనే లేక్ అంజా సమీపంలో సాకేత్‌కు చెందిన బ్యాక్‌ప్యాక్, ల్యాప్‌టాప్, పాస్‌పోర్ట్ లభించాయి. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవగా, ఎట్టకేలకు కాలిఫోర్నియాలోనే పోలీసులు అతడి మృతదేహాన్ని గుర్తించారు.  సాకేత్ శ్రీనివాసయ్యకు చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఇష్టం. ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆయన అక్కడ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చర్‌గా, యంగ్ రీసెర్చ్ ఫెలోగా పని చేశారు.
డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, యూనిలీవర్ వంటి దిగ్గజ సంస్థల్లో ఇంటర్న్‌గా అనుభవం గడించారు.  సెమీకండక్టర్లు, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ రంగంలో వినూత్న ఆవిష్కరణలు చేయాలనే తపనతో అమెరికా వెళ్లారు. ఐఐటీ మద్రాస్‌లోని ఈ-సెల్‌లో కూడా కీలక నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. 
సాకేత్ మృతిపై శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. “సాకేత్ కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఈ కష్టకాలంలో వారికి అండగా ఉంటాం. సాకేత్ పార్థివ దేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు పంపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాము” అని పేర్కొంది. ప్రస్తుతం స్థానిక పోలీసులు ఈ మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.