ఇకపై స్కూళ్లలో వందేమాతరం తప్పనిసరి

ఇకపై స్కూళ్లలో వందేమాతరం తప్పనిసరి
జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించే విషయంలో కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించాలని అని ఆదేశించింది. జాతీయ గీతం ‘జనగణమన’ పాడటానికి ముందు వందేమాతరం కూడా పాడాలని ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఉదయం తాజా ఆదేశాలు జారీ చేసింది. 
 
ఈ ఆదేశాల ప్రకారం వందేమాతరం ఆలపించేటప్పుడు అందరూ తప్పనిసరిగా నిలబడాలి. గేయంలోని ఆరు చరణాల్ని ఆలపించాల్సిందే. వీటిలో కాంగ్రెస్ 1937లో తొలగించిన నాలుగు చరణాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఆలపించాలి. గతంలో నెహ్రూ ఆధ్వర్యంలో సెక్యులర్ అంశాలను సాకుగా చూపి, ముస్లిం లీగ్ అభ్యంతరాల మేరకు గేయంలోని నాలుగు చరణాలను తొలగించారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం వాటిని కూడా తిరిగి చేర్చింది. 
 
ఈ అంశంపై గత ఏడాది కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం నడిచింది. తాజా మార్గదర్శకాల ప్రకారం సినిమా హాళ్లలో వందేమాతరం ప్లే చేయాల్సిన అవసరం లేదు. అలాగే థియేటర్లలో లేదా న్యూస్ రీల్స్‌లో ఈ గేయం ప్లే అవుతుంటే నిలబడాల్సిన అవసరం లేదు. ఇలాంటి చోట్ల ఎక్కువ మంది నిలబడటం వల్ల కార్యక్రమానికి ఆటంకం కలగడం, అలాగే శాంతి భద్రతల సమస్యను దృష్టిలో ఉంచుకుని తాజా ఆదేశాలిచ్చింది.‘వందేమాతరం’ ఆలపించడానికి మూడు నిమిషాల 10 సెకండ్ల సమయం పడుతుందని కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు అయినటువంటి రాష్ట్ర వేడుకలు, పౌర సన్మానాలు, రాష్ట్రపతి పర్యటన, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, మంత్రులు పాల్గొనే వేడుకలు, జాతీయ పతాకావిష్కరణ వంటి కార్యక్రమాల సందర్భంగా ఇకపై వందేమాతరం ఆలపించాలి. 

ఇప్పటికే పద్మ వంటి కేంద్ర అవార్డులు ప్రదానం చేసే వేడుకల్లో ఈ గేయాన్ని ఆలపిస్తున్నారు. ఈ నిబంధనలు అతిక్రమించి జాతీయ గేయాన్ని అవమానిస్తే వారికి గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ‘వందేమాతరం’ గేయాన్ని 1875లో బంకించంద్ర ఛటర్జీ రచించారు. తర్వాత దీన్ని ఆయనే తన ఆనంద్ మఠ్ అనే నవలలో భాగం చేశారు. ఈ గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే తాజా ఆదేశాలిచ్చింది.