భారత్ ట్యాక్సీ యాప్ ప్రారంభించిన అమిత్ షా

భారత్ ట్యాక్సీ యాప్ ప్రారంభించిన అమిత్ షా

దేశంలోని ప్రయాణికులు, ట్యాక్సీలు నడిపేవారి కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూపొందిన భారత్ ట్యాక్సీ యాప్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ప్రారంభించారు. ఈ రోజు నుంచి ఈ యాప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ప్రస్తుతం ఢిల్లీ పరిధితోపాటు, గుజరాత్‌లో మాత్రమే ఈ సేవలు ప్రారంభమయ్యాయి. రాబోయే రెండేళ్లలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో భారత్ ట్యాక్సీ యాప్ సేవలు ప్రారంభం కానున్నాయి.

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ద్వారకా నుంచి కామాఖ్య వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్‌ క్యాబ్‌ సర్వీసులతో పోలిస్తే భారత్‌ ట్యాక్సీలో చార్జీలు 30 శాతం తక్కువగా ఉంటాయి. నిజానికి ఈ యాప్ గత జూన్‌లో ప్రారంభమైంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రెండు నెలలపాటు పరీక్షించి, దీన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్ది తాజాగా అందుబాటులోకి తెచ్చారు. 

ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి సంస్థలకు భారత్ ట్యాక్సీ యాప్ ప్రత్యామ్నాయంగా నిలవనుంది.  దీన్ని కేంద్ర ప్రభుత్వంలోని సహకార శాఖ రూపొందించింది. దేశంలోని ఎనిమిది ప్రముఖ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఈ యాప్ డెవలప్ అయింది.  ఈ సహకార వ్యవస్థలో ప్రయాణికులు చెల్లించిన చార్జీలను పూర్తిగా డ్రైవర్లే పొందవచ్చు.

మల్టీ స్టేట్ కోపరేటివ్ సొసైటీస్ యాక్ట్, 2002 ప్రకారం ఈ సర్వీస్ అందుబాటులోకి తెచ్చారు. ఇది దేశీయ యాప్. ఈ యాప్‌ను టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్ నడిపేవారు ఎవరైనా వాడుకోవచ్చు.  ఇది ట్యాక్సీలు నడిపే వారికే కాకుండా వినియోగదారులకు కూడా మేలు చేస్తుంది.  ఎందుకంటే ఇందులో కమీషన్లు ఉండవు. జీరో కమిషన్ బేస్డ్ యాప్. అలాగే సర్జ్ ఫీలు కూడా ఉండవు. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఛార్జీలు పెంచడం జరగదు.

ఎమర్జెన్సీ అసిస్టెన్స్, వెరిఫైడ్ రైడ్ డాటాతోపాటు డ్రైవర్లు అవసరమైతే ఇతర ప్లాట్‌ఫామ్స్ కూడా వాడుకునేందుకు వీలుంటుంది.  ఇందులో డ్రైవర్లను సారథి అని పిలుస్తారు. ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా డ్రైవర్లకు రూ.10 కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. ఇప్పటివరకు ఈ యాప్‌లో 3 లక్షల మంది డ్రైవర్లు రిజిష్టర్ అవ్వగా.. లక్ష మంది వరకు వినియోగదారులు రిజిస్టర్ అయ్యారు. ప్రతి రోజూ పదివేలకుపైగా బుకింగ్స్ అవుతున్నాయి.