వివేకానంద స్మారక చిహ్నం ఏర్పాటులో కీలక పాత్రధారి పి. లక్ష్మణన్ శివైక్యం

వివేకానంద స్మారక చిహ్నం ఏర్పాటులో కీలక పాత్రధారి పి. లక్ష్మణన్ శివైక్యం

కన్యాకుమారిలోని సుప్రసిద్ధ వివేకానంద స్మారక చిహ్నం ఏర్పాటులో కీలక పాత్రధారి, రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ కార్యకర్త  పి. లక్ష్మణన్ (86) జనవరి 22న కన్నుమూశారు. అనేక సంవత్సరాలుగా తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న కన్యాకుమారి వివేకానంద కేంద్రంలో మధ్యాహ్నం 3:00 గంటలకు తుది శ్వాస విడిచారు.

కేరళ కోజికోడ్‌లోని వెల్లైయిల్‌కు చెందిన లక్ష్మణన్‌ 1962లో శ్రీపాదపార (వివేకానంద శిల)ను తిరిగి పొందేందుకు చేసిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఒకరు.  నాటి ఆ ఉద్యమమే నేటి సుప్రసిద్ద వివేకానంద స్మారక చిహ్నం ఏర్పాటుకు పునాది వేసింది.

1962 మిషన్: వివేకానంద శిల తిరిగి స్వాధీనం
పి. లక్ష్మణన్ పేరు చెబితే 1962లో కన్యాకుమారిలో చేపట్టిన సాహసోపేతమైన ఉద్యమం స్ఫురణకు వస్తుంది. కన్యాకుమారి సముద్ర తీరంలో ఉన్న రాతిశిలను క్రైస్తవ మిషనరీలు చట్టవిరుద్ధంగా ఆక్రమించారు.  వెంటనే ఆ ప్రదేశంలో ఒక శిలువ ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం పేరును ‘కన్యాకుమారి’ నుండి ‘కన్య మేరీ’గా మార్చేందుకు ఒక పథకం ప్రకారం మొదలైన కుట్రను రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సకాలంలో గుర్తించింది.

తమిళనాడులో ఆరెస్సెస్ ప్రతిఘటనను ఎదుర్కొంటున్న ఆ సమయంలో నాటి ప్రాంత్ ప్రచారక్ దత్తాజీ దిడోల్కర్ ఆక్రమణకు గురైన స్థలాన్ని తిరిగి పొందడానికి కేరళ స్వయంసేవకుల సహాయం కోరారు. వెంటనే కోజికోడ్ విభాగ్ ప్రచారక్ పి. మాధవ్, జిల్లా ప్రచారక్ వి.పి. జనార్ధనన్ మార్గదర్శకత్వంలో 15 మంది సాహసోపేతమైన యువ స్వయంసేవకుల బృందం ఈ విషయమై సమావేశమైంది. ఈ బృందంలోని వారంతా కోజికోడ్ సముద్రతీర ప్రాంతంలో చేపలు పడుతూ జీవనం సాగించేవారు. సీనియర్ కార్యకర్తలు లక్ష్మణన్, ఎ.వి. బాలన్‌తో కలిసి ఈ 15 మంది సభ్యుల బృందానికి నాయకత్వం వహించారు.

“ఆపరేషన్ విజయదశమి”
స్వయంసేవకుల బృందం కన్యాకుమారికి పయనమైంది. అక్కడి సముద్ర ప్రవాహాలు, భూభాగం, భద్రతా పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఈ బృందం అనేక రోజులు కన్యాకుమారిలో బస చేసింది. అక్టోబర్ 8, 1962 విజయదశమి పర్వదినాన స్వయంసేవకుల బృందం సముద్రమార్గంలో ఈదుకుంటూ క్రైస్తవ మిషనరీలు ఆక్రమించిన ప్రాంతానికి చేరుకుంది. అక్కడి రాతిపైకి ఎగబాకి ఆ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన శిలువ, ఇతర నిర్మాణాలు తొలగించారు.

ఈ పోరాటాన్ని రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్, కన్యాకుమారిలోని వివేకానంద కేంద్ర సంస్థలు వివేకానంద శిలకు కలిగిన “విముక్తి”గా పరిగణిస్తాయి. ఏకనాథ్ రనడే నిర్మించిన సుప్రసిద్ధ వివేకానంద శిలా స్మారక చిహ్నానికి ఈ పోరాటం మార్గం సుగమం చేసింది. పి.లక్ష్మణన్ తన జీవితాన్ని ఈ లక్ష్యానికి అంకితం చేశారు. ఈ పోరాటంలో తన పాత్రను “భారత మాత పాదాలకు చేసిన ఆధ్యాత్మిక సమర్పణగా” భావించారు.

15 మంది సభ్యుల బృందం ఇదే:  

కన్యాకుమారి సముద్రతీరంలో ఆక్రమణకు గురైన వివేకానంద శిల స్వాధీనం కోసం చేపట్టిన చారిత్రాత్మక ఉద్యమంలో కోజికోడ్‌లోని వెల్లైల్, కోయిలాండి, బేపూర్ వంటి వివిధ ప్రాంతాల నుండి 15 మంది స్వయంసేవకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ బృందంలో వెల్లైయిల్ నుండి పి.లక్ష్మణన్ తో పాటు ఎన్.పి. నారాయణన్, కె. అంబుజన్, కె.పి. చంద్రన్, కె. రామన్, కె. కుట్టిమోన్, కోయిలాండి ప్రాంతం నుండి ఎ.వి. బాలన్, పయ్యోలి ప్రాంతం నుండి వి.పి. రామన్, వి.పి. అచ్యుతన్, కె. శ్రీధరన్, టి.పి. గంగాధరన్ ; బేపోర్ నుండి ఎం. దాసన్, ఎం. కృష్ణన్, కె. వాసు, కరువంతురుతు ఉన్ని పాల్గొన్నారు.
పి.లక్ష్మణన్ కు  వెల్లైయిల్ ప్రాంతానికి చెందిన కోమలతో వివాహమైంది. వారి కుమారుడు జగదీష్, హర్యానాలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. తన జీవితాన్ని దేశ సాంస్కృతిక స్వరాజ్యానికి అంకితం చేసిన అపార ధైర్యశాలిగా పేరుపొందిన లక్ష్మణన్‌ను స్మరిస్తూ రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్, బిజెపి జ్యేష్ఠ కార్యకర్తలు, నాయకులు నివాళులు అర్పించారు.