జార్ఖండ్‌లో ఏనుగు బీభ‌త్సం.. 22 మంది మృతి

జార్ఖండ్‌లో ఏనుగు బీభ‌త్సం.. 22 మంది మృతి
జార్ఖండ్‌లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. సుమారు 22 మందిని చంపింది. ఈ ఘటన తాజాగా పశ్చిమ సింగ్‌భూమ్‌ జిల్లాలో జరిగింది. దీంతో జార్ఖండ్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ అడవి ఏనుగు గుంపు నుండి వేరుపడడంతో భీకరంగా ప్రవర్తిస్తూ దాడికి పాల్పడింది. ఈ ప్రాణాంతక దాడిలో 20 మందికి పైగా మృతి చెందినట్లు అటవీ అధికారులు వెల్లడించారు. ఈ ఏనుగు సుమారు 30 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తోంది.
దీంతో ఈ ఏనుగును పట్టుకునేందుకు అటవీ శాఖ వందమందిని రంగంలోకి దింపింది. మూడుసార్లు మత్తుమందు ఇచ్చి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బహుశా ఆ ఏనుగులో టెస్టోస్టెరాన్‌ స్థాయిలు పెరగడం వల్ల విపరీతంగా ప్రవర్తిస్తూ ఉండొచ్చని అటవీ అధికారులు అభిప్రాయపడ్డారు.  ఏనుగు బీభత్సం వల్ల ఈ ప్రాంతంలో పదుల సంఖ్యలో బలయ్యారు. ఇదివరకెన్నడూ ఇలాంటి సంఘటన ఈ ప్రాంతంలో జరగలేదని డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ కుల్దీప్‌ మీనా తెలిపారు. 
కాగా, జార్ఖండ్‌లో 550 నుంచి 600 ఏనుగులు ఉంటాయి. పలము, దక్షిణ చోటానాగ్‌పూర్‌లో రెండు ప్రధాన ఏనుగు గుంపులు ఉన్నాయి.  అడవికి సమీప గ్రామాల్లో ఏనుగులు దాడి చేస్తుంటాయి. ప్రత్యేకించి రాత్రిపూట, నీరు, తిండికోసం గ్రామాల్లోకి వస్తుంటాయి. 2000 నుంచి 2025 మధ్యలో జరిగిన ఏనుగుల దాడిలో దాదాపు 1400 మంది మృతి చెందినట్లు ప్రాథమిక అంచనా.