బాధ్యతలు అప్పగిస్తూ జేపీ నడ్డా “నితిన్ నబీన్ నాయకత్వంలో, మోదీ మార్గదర్శకత్వంలో రాబోయే రోజుల్లో బంగాల్లో కమలం వికసిస్తుంది. పుదుచ్చేరి, తమిళనాడులో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అసోంలో మళ్లీ అధికారంలోకి వస్తాం. కేరళలోనూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం. మనం ఇంకా విజయం సాధించని కొత్త ప్రదేశాల్లో జెండా పాతాలి” అని ధీమా వ్యక్తం చేశారు.
భారతీయ జనతా పార్టీ చేతిలోనే దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. గత 12 ఏళ్లలో ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని గుర్తు చేసుకున్నారు. తొలిసారి బంగాల్, తెలంగాణలో కూడా అధికారంలోకి రానున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీది మాత్రం ఎల్లప్పుడూ అభివృద్ధి మోడల్ అంటూ చెప్పుకొచ్చారు.
బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు కాగలరని ప్రధాని మోదీ తెలిపారు. పార్టీ నిర్ణయాలు, ఎంపిక అన్నీ ప్రజాసామ్యయుతంగా ఉంటాయని చెప్పారు. దేశ సేవ, ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని, కార్యకర్త కేంద్రంగా పార్టీ సిద్ధాంతాలు ఉంటాయని తెలిపారు. బీజేపీ కార్యకర్త అని అనిపించుకోవడమే తన గర్వకారణంగా ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు.
“బీజేపీలో ప్రత్యేకంగా పదవులు, బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క కార్యకర్త స్వయంగా బాధ్యతలు తీసుకోవాలి. పార్టీ కోసం కృషి చేయాలి. కొత్తగా వస్తున్న మార్పులను పార్టీ అందిపుచ్చుకోవాలి, అనుసరించాలి. రేడియో నుంచి ఏఐ పరిజ్ఞానం వరకు అన్నింటినీ ఉపయోగించుకోవాలి” అని ప్రధాని సూచించారు. “పార్టీ బాధ్యతలను జీవనశైలిగా భావించాలి. బాధ్యతలు ఒకరి నుంచి ఒకరికి మారుతాయి, లక్ష్యం మారదు. నాయకత్వం మారినా మన గమ్యం మారొద్దు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలి” అంటూ మోదీ పిలుపునిచ్చారు.
ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా తాను అభివర్ణించిన బీజేపీకి అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు నితిన్ నబీన్కు అభినందనలు తెలిపారు మోదీ. ఆయన బాధ్యత కేవలం బీజేపీని నిర్వహించడంతోనే ముగిసిపోదని చెప్పారు. “పార్టీ విషయానికి వస్తే, నితిన్ బాస్, నేను ఒక పార్టీ కార్యకర్తను. ఇప్పుడు గౌరవనీయులైన నితిన్ నబీన్ జీ మనందరికీ అధ్యక్షుడు. ఆయన బాధ్యత కేవలం బీజేపీని నిర్వహించడం మాత్రమే కాదు, ఎన్డీఏ మిత్రపక్షాలన్నింటి మధ్య సమన్వయం ఉండేలా చూడటం కూడా” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
రాబోయే దశాబ్దాల ప్రాముఖ్యాన్ని నొక్కి చెబుతూ, ప్రధాని మోదీ, “రాబోయే 25 సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలోనే అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాల్సి ఉంది. అది జరగడం ఖాయం” అని తెలిపారు. నితిన్ పార్టీ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నితిన్ నబీన్లో ఉన్న యువశక్తి, అనుభవం పార్టీకి పనికొస్తుందని చెప్పారు. 45 ఏళ్ల నబిన్ ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాలలో పెద్ద మార్పులను చూసిన తరానికి చెందినవారని తెలిపారు.

More Stories
తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్
భారత్, యుఎఇ ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు
భారత్ ను ఇరకాటంలో పడేస్తున్న ట్రంప్ గాజా శాంతి మండలి