ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ సుదీర్ఘంగా ప్రశ్నించింది. గులాబీ పార్టీ పెద్దలతో ఉన్న ఆర్థిక సంబంధాలపైనా ఆరా తీసింది. దాదాపు 9 గంటల పాటు సాగిన విచారణలో నవీన్ రావు సమాచారం ఆధారంగా మరికొందరు కీలక నేతలను విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ముఖ్య నేతలు తెరపైకి వస్తున్నారు.
ఇప్పటి వరకు పోలీస్ అధికారులు, ప్రైవేటు వ్యక్తుల చుట్టే తిరిగిన దర్యాప్తు, తాజాగా ప్రజాప్రతినిధుల వైపు మళ్లింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును ఆదివారం ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన నవీన్ రావును, రాత్రి 8 గంటల వరకు విచారించారు. సిట్ సభ్యులు మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ రవీందర్ రెడ్డి సహా ఇతర ఉన్నతాధికారులతో కూడిన బృందం నవీన్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
గత ప్రభుత్వంలో ఎస్.ఐ.బిలో పని చేసిన ప్రభాకర్రావు బృందంతో ఉన్న సంబంధాలపైనా సిట్ ఆరా తీసింది. ముఖ్యంగా గులాబీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు సమకూరిన విషయంలో నవీన్ పాత్ర ఏంటనే కోణంలో విచారణ జరిగినట్లు తెలుస్తోంది. ఆ సొమ్ముతో ఫోన్ అక్రమ ట్యాపింగ్కు సంబంధముందా? అని ఆరా తీసినట్లు సమాచారం. వాస్తవానికి హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న క్రమంలోనే నవీన్ రావు పేరు తెరపైకి వచ్చింది.
ఆయనకు నోటీస్ ఇచ్చి 2024 సెప్టెంబర్ 24న వాంగ్మూలం నమోదు చేశారు. తాజాగా మరోసారి ఆయన్ని విచారించడం ప్రాధాన్యం సంతరించుకొంది. గతంలో అడిగిన విషయాలనే మరోసారి సిట్ అధికారులు అడిగారని ఎమ్మెల్సీ నవీన్ రావు తెలిపారు. బయట ప్రచారం జరుగుతున్నట్లు తానే ట్యాపింగ్ పరికరాలను సమకూర్చాననే విషయంలో ఎలాంటి ప్రశ్నలు అడగలేదని, అలాంటి ప్రస్తావనే రాలేదని స్పష్టం చేశారు.

More Stories
ఎస్సీ కులస్థులు, గిరిజన తెగలు కలిసి పనిచేయాలి
వరంగల్ కోట భూముల్లో అక్రమ నిర్మాణాలపై రేవంత్ కు కిషన్ లేఖ!
కొత్త `ఉపాధి’ చట్టంపై ప్రతిపక్షాల కుట్రలను పటాపంచలు చేయాలి