తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్రప్రభుత్వం సంపూర్ణ సహకారం అందజేస్తుందని, అందుకై ఓ కమిటీ వేసిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. ఆ కమిటీని కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ నోటిఫై చేసిందని తెలిపారు. కేంద్ర జల వనరుల సంఘం చైర్మన్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తోందని స్పష్టం చేశారు.
ఈ కమిటీలో సభ్యులుగా తెలంగాణ నుంచి జలవనరుల శాఖ సలహాదారు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ, ఇంజనీర్ ఇన్ చీఫ్ సభ్యులుగా ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ, జలవనరుల శాఖ సలహాదారు, ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఇరిగేషన్), చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉన్నారు.
వీరితోపాటుగా కృష్ణానది యాజమాన్య బోర్డు, హైదరాబాద్ చైర్మన్, గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్లు, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ చీఫ్ ఇంజనీర్, సిడబ్ల్యుసి చీఫ్ ఇంజనీర్ కూడా సభ్యులుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకార సమాఖ్య విధానంతో గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తోందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
కృష్ణానది జల వివాద పరిష్కారానికి 6 అక్టోబర్ 2023నాడు కృష్ణ జల వివాదాల ట్రిబ్యునల్ ను ఏర్పాటుచేసి అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ను నిర్దేశించింది. రెండేళ్ల కాల వ్యవధి 1 ఆగస్టు, 2025 నాడు ముగిసింది. కృష్ణాజలాల వినియోగంపై వాదనలు నడుస్తోండటంతో దీన్ని మరో ఏడాది (31 జూలై, 2026) పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
కాగా, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని చాప్టర్ 9, సెక్షన్ 84 ప్రకారం కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించిన విషయంలో సమస్యల పరిష్కారం కోసం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. 16, జూలై 2025 నాడు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ (జల్శక్తి) మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రస్తావించగా వాటిని చర్చించి, సాంకేతికతంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. ఇందుకోసం ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ప్రతినిధులను నామినేట్ చేయాలని సూచించింది. డిసెంబర్ 23, 2025 నాడు తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేయడంతో శుక్రవారం కేంద్ర జలవనరుల సంఘం కొత్త కమిటీని నోటిఫై చేసింది.

More Stories
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు
వేర్పాటువాదంపై సామాన్యుల పోరాటాలను వివరించే ‘అస్సాం గాథలు’
తెలంగాణ పోలీసులకు చిక్కిన కీలక నేత బర్సే దేవా