రష్యా చమురు నిల్వ ట్యాంకులపై ఉక్రెయిన్ డ్రోన్లు

రష్యా చమురు నిల్వ ట్యాంకులపై ఉక్రెయిన్ డ్రోన్లు

ఉక్రెయిన్‌ దాడిలో రష్యాలోని టెమ్రియుక్‌ ఓడరేవులోని చమురు నిల్వ ట్యాంకులు మంటల్లో చిక్కుకున్నట్లు అధికారులు గురువారం తెలిపారు.  గంటల వ్యవధిలోనే మంటలు  4,000చదరపు కిలో మీటర్లకు వ్యాపించాయని, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ సిబ్బంది సహా 26 ప్రత్యేక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పారు.

క్రాస్నోడార్‌ ప్రాంతంలోని ప్రధాన ఓడరేవుపై ఉక్రెయిన్‌ బుధవారం రాత్రి ఉక్రెయిన్‌ 141 డ్రోన్‌లతో విరుచుకుపడిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. మాస్కో, వోల్గోగ్రాడ్‌, వొరోనెజ్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ అడిజియా, క్రిమియన్‌ ప్రాంతాలపై కూడా దాడులకు దిగినట్లు పేర్కొంది.  షెర్బినోవ్స్కీ జిల్లాలోని నికోలెవ్కా గ్రామంలో పలు భవనాలు, వ్యవసాయ పరికరాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది.  ఇంధన ఉత్పత్తిని దెబ్బతీయడం, రష్యన్‌ సైన్య ప్రణాళికలకు అంతరాయం కలిగించే లక్ష్యంతో ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులకు దిగుతోందని మాస్కో మేయర్‌ సెర్గీ తెలిపారు.

మరోవంక, రష్యాలో వరుస కారు బాంబుల పేలుడు ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా బుధవారం తెల్లవారుజుమున దేశ రాజధాని మాస్కోలో బాంబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు ట్రాఫిక్‌ పోలీసు అధికారులతో సహా ముగ్గురు మృతి చెందారు.  మాస్కో నగరంలోని ఎలెటస్కయ వీధిలో పోలీసు కారు దగ్గర ఇద్దరు పోలీసు అధికారులు అనుమానాస్పద వ్యక్తిని చూసారని, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు అతని దగ్గరికి పోలీసులు వచ్చినప్పుడు పేలుడు జరిగిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 

 
ఇద్దరు పోలీసులు అధికారులు తీవ్ర గాయాలతో మృతి చెందారు. సమీపంలో నిలబడి ఉన్న మరొక వ్యక్తి కూడా మృతి చెందారు.  సోమవారం మాస్కోలో జరిగిన కారు బాంబు దాడిలో సీనియర్‌ రష్యన్‌ జనరల్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలోనే మరో పేలుడు జరిగటం గమనార్హం.