డిసెంబర్ 25 నుండి 29 వరకు హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతి వనంలో విశ్వ సంఘ్ శిబిర్ నిర్వహిస్తున్నారు. హిందూ స్వయంసేవక్ సంఘ్, సనాతన ధర్మ స్వయంసేవక్ సంఘ్, హిందూ సేవా సంఘం, సేవా ఇంటర్నేషనల్, సంస్కృత భారతి, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థల సభ్యులు, తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరుపుకునే ఒక ఆనందోత్సాహాల వేడుక మాదిరిగా ఈ శిబిరం జరుగుతుంది.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రతినిధులు ఒకరినొకరు కలుసుకోవడానికి, పరస్పరం సంభాషించడానికి, ఒకరి అనుభవాల నుండి మరొకరు నేర్చుకోవడానికి ఇది ఒక విశిష్టమైన వేదికను అందిస్తుంది. ఈ సంస్థలన్నీ సంస్కారము (విలువలు), సేవ, సంఘటన్ (సంస్థ) అనే ఉమ్మడి విలువల ద్వారా ప్రేరణ పొందినవి. అనేక దేశాలలో, భారత్ లేదా తూర్పు ఆఫ్రికా నుండి వలస వెళ్ళిన సంఘ్ స్వయంసేవకులు లేదా సమాజ నిర్మాణానికి వ్యక్తిత్వ నిర్మాణమే పునాది అని నమ్మే నిబద్ధత కలిగిన హిందువుల ద్వారా ఈ సంస్థలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంస్థ తాను సేవలందిస్తున్న సమాజంలో నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి స్వతంత్రంగా పనిచేస్తుంది.
విశ్వ సంఘ్ మొదటి శిబిరం 1990లో బెంగళూరులో జరిగింది. ఆ తర్వాత క్రమంగా వడోదర, ముంబై, గాంధీనగర్, పూణే, ఇండోర్ నగరాలలో జరిగాయి. ఇప్పుడు ఏడవ విశ్వ సంఘ్ శిబిరం కన్హా శాంతి వనంలో జరుగనుంది. 75కు పైగా దేశాల నుండి వచ్చే సుమారు 2,000 మంది ప్రతినిధులను స్వాగతించేందుకు, వారు సౌకర్యవంతంగా బస చేయడానికి, శిబిరంలో పాల్గొనేందుకు, ఈ శిబిరం వారి మదిలో చిరస్మరణీయమై నిలిచేలా చూసేందుకు కార్యకర్తల బృందాలు నిర్విరామ కృషి చేస్తున్నాయి.
ఈ శిబిరం ప్రధాన ఇతివృత్తం “ధర్మే సర్వం ప్రతిష్ఠితమ్”, అంటే “ధర్మమే అంతటికీ పునాది”. వివిధ దేశాల కార్యకర్తలతో కూడిన నిర్వహణ బృందం క్రమం తప్పకుండా ఆన్లైన్ సమావేశాల ద్వారా ఈ కార్యక్రమ ప్రణాళికను రూపొందించింది. ఇందులో చిన్నారులు, బాలలు, యువత, పెద్దలు, వృద్ధులు ఇలా అన్ని వయసుల వారికి తగిన సమావేశాలు, కార్యకలాపాలు ఉంటాయి.
డిసెంబర్ 25 ఉదయం శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి పూజ్య స్వామి గోవింద దేవ్ గిరి ఆశీస్సులతో శిబిరం అధికారికంగా ప్రారంభమవుతుంది. శిబిర ప్రధాన ఇతివృత్తంపై ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే ముఖ్య ప్రసంగం చేస్తారు. ‘హార్ట్ఫుల్నెస్ మూవ్మెంట్’ ఆధ్యాత్మిక గురువు పూజ్య శ్రీ దాజీ కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విచ్చేస్తారు. తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఈ శిబిరానికి ‘శిబిరాధికారి’గా వ్యవహరిస్తారు. 28న ముగింపు కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ ముగింపు ప్రసంగం చేస్తారు.

More Stories
అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు అనూహ్య స్పందన
కక్ష్యలోకి బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం
బంగ్లాదేశ్లో మూకదాడిపై భారత్లో ఆగ్రహ జ్వాల