ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల నిజాయతీకి ప్రాధాన్యత ఇవ్వాలి

ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల నిజాయతీకి ప్రాధాన్యత ఇవ్వాలి
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల నైపుణ్యాల కంటే ముందు వారి నిజాయతీ, సమగ్రతకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ఈ రెండు లక్షణాల విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని ఆమె తేల్చి చెప్పారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ప్రారంభమైన రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్‌పర్సన్‌ల జాతీయ సదస్సును ఆమె శుక్రవారం ప్రారంభించి ముఖ్య ప్రసంగం చేశారు. 
 
రాష్ట్రపతి మాట్లాడుతూ, అభ్యర్థుల్లో నైపుణ్యాలు లోపిస్తే శిక్షణ ద్వారా మెరుగుపరచవచ్చని, కానీ నిజాయతీ, చిత్తశుద్ధి లేకపోతే పరిపాలన వ్యవస్థ తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అందుకే నియామక ప్రక్రియలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు సమగ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు.  ప్రభుత్వ సేవలోకి వచ్చే యువత సమాజంలోని అట్టడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలనే భావన కలిగి ఉండాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. 
ప్రభుత్వ పాలనలో మహిళల అవసరాలు, సమస్యల పట్ల సివిల్ సర్వెంట్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్రపతి పేర్కొన్నారు.  అభ్యర్థుల్లో జెండర్ సెన్సిటైజేషన్‌ను పెంపొందించేలా పీఎస్‌సీలు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. అలా చేస్తే ప్రభుత్వ పథకాలు మహిళలకు మరింత సమర్థవంతంగా చేరతాయని ఆమె అభిప్రాయపడ్డారు. నిష్పాక్షికత, స్థిరత్వం, నిరంతరత వంటి లక్షణాలు ప్రభుత్వ పాలనకు అందించేది శాశ్వత కార్యనిర్వాహక వర్గమేనని ఆమె పేర్కొన్నారు.
 
ఈ కీలక బాధ్యతగల అధికారులను ఎంపిక చేసే బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్లదేనని రాష్ట్రపతి గుర్తు చేశారు. మారుతున్న సాంకేతిక పరిణామాలను దృష్టిలో ఉంచుకొని నియామక ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయతను బలోపేతం చేయాలని రాష్ట్రపతి సూచించారు. 2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని సాధించడంలో పీఎస్‌సీలు ఎంపిక చేసే అధికారుల పాత్ర అత్యంత కీలకమని ఆమె తెలిపారు. 
కాగా, శీతాకాల విడిది పర్యటనలో భాగంగా ఇవాళ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కలిసి ఫ్లోర్ ఆఫ్ రాష్ట్రపతి నిలయం పుస్తకాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె పబ్లిక్​ సర్వీస్​ కమిషన్స్​ ఛైర్​పర్సన్ల సదస్సులో పాల్గొన్నారు. నియామకాల విషయంలో సర్వీస్​ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయని కొనియాడారు. 
 
1950 తర్వాత యూపీఎస్సీ, పబ్లిక్​ సర్వీస్​ కమిషన్ల ఏర్పాటు మొదలైందని రాష్ట్రపతి గుర్తు చేశారు.  పబ్లిక్​ సర్వీస్​ కమిషన్ల విషయంలో అంబేడ్కర్​ కీలక పాత్ర పోషించారని చెబుతూ లక్ష్యాలు సాధించే దిశగా పబ్లిక్​ సర్వీస్​ కమిషన్లు ఉండాలని ఆమె సూచించారు. నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కారం అవసరమని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.
రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యూజీసీ చైర్మన్ వినీర్ జోషి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు.. ఈ సదస్సుకు హాజరయ్యారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎదుర్కొంటున్న సవాళ్లు, పరీక్షల నిర్వహణలో అనుసరించాల్సిన పద్ధతులు, పరస్పర సహకారంపై ఈ సదస్సులో చర్చించనున్నారు.