బంగ్లాలో మరో రెండు భారత వీసా కేంద్రాలు మూసివేత

బంగ్లాలో మరో రెండు భారత వీసా కేంద్రాలు మూసివేత

పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌ లో మరో రెండు భారత వీసా కేంద్రాలు మూతపడ్డాయి. రాజ్‌షాహి, ఖుల్నాలోని వీసా కేంద్రాలను భారత్‌ మూసేసింది. రాజధాని ఢాకాలోని వీసా కేంద్రాన్ని ఇప్పటికే భారత్‌ మూసివేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ నాయకులు, అసాంఘిక శక్తుల నుంచి బెదిరింపుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా వీసా కేంద్రాలను భారత్‌ మూసివేసింది. 

‘భద్రతా పరిస్థితుల దృష్ట్యా రాజ్‌షాహి, ఖుల్నాలోని వీసా కేంద్రాలను మూసివేస్తున్నాం. వీసా దరఖాస్తు కోసం ఈరోజు బుక్‌ అయిన అపాయింట్‌మెంట్‌ స్లాట్‌లను మరో తేదీకి మారుస్తాం’ అని భారత్‌ ప్రకటించింది. మరోవైపు,  ఢాకాలోని జమున ఫ్యూచర్ పార్క్‌లో భారత వీసా అప్లికేషన్ సెంటర్ భారత్‌ బుధవారం మూసివేసిన విషయం తెలిసిందే. 

ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు కొరవడ్డాయి. ఆ దేశంలో రోజురోజుకు సురక్షిత వాతావరణం తగ్గిపోతుండడాన్ని సీరియస్‌గా తీసుకున్న విదేశీ మంత్రిత్వ శాఖ భారత్‌లోని బంగ్లా దౌత్యాధికారికి బుధవారం ఉదయం సమన్లు జారీ చేసింది. ఆ కొద్దిసేపటికే ఢాకా వీసా అప్లికేషన్ సెంటర్లో సేవలకు మంగళం పాడింది. ఇప్పుడు తాజాగా మరో రెండు వీసా సెంటర్ల సేవలను నిలిపివేసింది.